టీఆర్ఎస్లో ఉత్కంఠ: సంతోష్ ఖరారు, మరో ఇద్దరు ఎవరు? బాబుకు దేవేందర్ లేఖ
Recommended Video
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అభ్యర్థుల ఎంపికకు ఆదివారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు టిఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు.
తెరాసలో ఇక టీ న్యూస్ ఎండీ కీలకం: ఎవరీ సంతోశ్ కుమార్?
సమావేశాంతరం ముగ్గురు అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యసభకు ఎవరిని పంపిస్తారనే విషయంపై ఇప్పటికే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పోటీలో మాత్రం పలువురు ఉన్నారు.
సంతోష్ పేరు ఖరారు...
రాజ్యసభ ఎన్నికలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సతోష్ పేరు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన కేసీఆర్కు సమీపం బంధువు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారిక న్యూస్ చానెల్ టీన్యూస్ సివోగా కూడా వ్యవహరిస్తున్నారు.
యాదవుల మధ్య పోటీ...
యాదవ కోటాలో జైపాల్ యాదవ్కు గానీ లింగయ్య యాదవ్కు గానీ అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. జైపాల్ యాదవ్ అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. మరో స్థానానికి మాజీ మంత్రి ఉమామాధవ రెడ్డి మహబూబ్ అలీఖాన్తో పోటీ పడుతున్నారు. ఉమామాధవ రెడ్డి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్లో చేరారు. ఈ నెల 12వ తేదీన వారు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
చంద్రబాబుకు దేవేందర్ గౌడ్ విజ్ఞప్తి
రాజ్యసభ సభ్యుడిగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. రాజ్యసభకు ప్రజల నుంచి వ్యక్తినే ఎన్నుకోవాలని ఆయన చంద్రబాబును కోరారు.
దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే...
దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే చట్టాల రూకపకల్పనలో రాజ్యసభ సభ్యుల పాత్ర కీలకమైందని, అలాంటి సభకు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేవారినే ఎన్నుకోవాలని దేవేందర్ గౌడ్ చంద్రబాబుకు రాసిన లేఖలో అన్నారు.
రెండు స్తానాలకే పోటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు మాత్రమే తమ అభ్యర్థులను పోటీకి దించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు అమరావతిలో చంద్రబాబును కలిశారు. నేతలతో చర్చలు జరిపి చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.