విద్యుత్ ఉద్యోగులపై కేసీఆర్ వరాల వర్షం: ‘చంద్రబాబు దుకాణమా?’ అంటూ సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ ఉద్యోగులపై వరాల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి విజయం విద్యుత్ రంగంలోనే సాధించామని ఆయన అన్నారు.
ఇప్పటికే రూ. 250 కోట్ల విలువైన విద్యుత్ను విక్రయించామని తెలిపారు. శనివారం ప్రగతి భవన్లో విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైన సీఎం కేసీఆర్ వారికి తీపి కబురు చెప్పారు.
35శాతం పీఆర్సీ
విద్యుత్ ఉద్యోగులకు 35శాతం వేతన సవరణ ప్రకటించారు సీఎం కేసీఆర్. తన వరకు వచ్చిన ఉద్యోగుల సమస్యలను గతంలోనే పరిష్కరించినట్లు తెలిపారు. జేఎల్ఎంలకు సంబంధించిన కేసు కోర్టులో ఉందని చెప్పారు. కేసు విత్ డ్రా చేసుకుంటే మిగిలిన 600 మందిని కూడా నియమించుకోవచ్చని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ స్కీం...
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే హెల్త్ స్కీమ్ను విద్యుత్ ఉద్యోగులకు కూడా వర్తింప చేస్తామని కేసీఆర్ చెప్పారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే నాణ్యమైన విద్యుత్ వస్తుందని అన్నారు. అనారోగ్యం బారిన పడిన విద్యుత్ ఉద్యోగులను తప్పకుంటా ఆదుకుంటామని చెప్పారు. 50వేల మందిలో 6వేల మందికి జీపీఎఫ్ సమస్య ఉందని, జీపీఎఫ్ అనేది కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. వివాదంలో ఉన్న సీపీఎస్ను కూడా పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా నిరంతర విద్యుత్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. పరిశ్రమలతోపాటు రైతులకు 24గంటలు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని సీఎం కేసీఆర్ చెప్పారు. లక్షకోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు. తాము చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు కూడా విద్యుత్ మీద ఆధారపడినవేనని తెలిపారు.
శాపనార్థాలు పెట్టిన వారే చీకట్లో కలిసిపోయారు
తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని కొందరు శాపనార్థాలు పెట్టారని చెప్పిన సీఎం.. వాళ్ల అంచనాలు తప్పని నిరూపించడంలో విద్యుత్ ఉద్యోగులది కీలక పాత్ర అని ప్రశంసించారు. తెలంగాణ చీకటి అవుతుందన్నవారే చీకట్లో కలిసిపోయారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు దుకాణమంటూ సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైనా కేసీఆర్ సెటైర్లు వేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొందరు తమ సమస్యలు కూడా తీర్చాలంటూ ఈ సందర్భంగా కేసీఆర్ను కోరారు. ‘ఇది చంద్రబాబు నాయుడు పెట్టిన దుకాణమా?' అంటూ కేసీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామంటూ వారికి భరోసా ఇచ్చారు కేసీఆర్. విద్యుత్ శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పారు.