ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా
హైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకూ విడుదలైంది. మజ్లిస్ పోటీ చేసే హైదరాబాద్ మినహా 16 స్థానాల్లో పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల వివరాలను ఆయన ప్రకటించారు. దాదాపు నెల రోజులుగా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన గులాబీ బాస్ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిత్వం ఖరారు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పనితీరుపై ఆరాతీసి ఏడుగురు సిట్టింగ్ లను మళ్లీ అవకాశమిచ్చిన టీఆర్ ఎస్ అధినేత ముగ్గురికి మాత్రం టికెట్ నిరాకరించారు. మొత్తం మీద బాల్క సుమన్, మల్లారెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్.. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలపై స్థానికుల ఫిర్యాదుతో టికెట్ ఇవ్వలేదు.
జెడి జగన్ గుట్టు విప్పాలి : పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా: చంద్రబాబు సంచలనం..!
ముగ్గురు సిట్టింగ్ లకు నోఛాన్స్
అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఈసారి ఏడుగురుసిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు. కరీంనగర్ నుంచి బి. వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్ నుంచి జి. నగేష్, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి నియోజకవర్గం నుంచి బూర నర్సయ్య గౌడ్, వరంగల్ నుంచి పసునూరి దయాకర్ , జహీరాబాద్ నుంచి బీబీపాటిల్ కు మళ్లీ టికెట్ల కన్ఫర్మ్ చేశారు. ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిని పక్కన బెట్టిన కేసీఆర్ ఆ టికెట్ ను మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జితేందర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులకు సహకరించలేదనే ఆరోపణలతో పక్కన పెట్టారు. గత లోక్ సభ లో టీఆర్ఎస్ ప్లోర్ లీడర్ గా పనిచేసిన జితేందర్ రెడ్డిని పక్కనపెట్టడం సర్వత్రా చర్చానీయాంశమైంది. ఇక మహబూబాబాద్ స్థానంలో సీతారాం నాయక్ స్థానంలో మాలోతు కవితను బరిలో దింపారు కేసీఆర్. కవిత మాజీ ఎమ్మెల్యే, రెడ్యానాయక్ కూతురు. సీతరాంపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో సిట్టింగ్ ను మార్చారు. ఇక్కడినుంచి ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్ పేరు వినిపించినా .. గెలుపుగుర్రాల ఆధారంగా టికెట్ కేటాయించారు.
నామాకు టికెట్
దీంతోపాటు , ఖమ్మం స్థానంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బదులుగా పార్టీలో కొత్తగా చేరిన నామా నాగేశ్వర రావుకు కట్టబెట్టారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వ్యతిరేకతతో టికెట్ ఇవ్వలేదు. అయితే అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, నామాకు మధ్య అభిప్రాయభేదాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్ సభ పోటీకి నామాకు సహకరిస్తారా అనే అనుమానం కలుగుతోంది. గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎంపీ మల్లారెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డికి అవకాశమిచ్చిన కేసీఆర్, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్ స్థానంలో బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి బరిలోకి దింపారు. సుమన్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి నుంచి జీ వివేక్ పేరు పరిశీలిస్తారని తెలిసినా .. చివరి నిమిషంలో వెంకటేశ్కు టికెట్ ఇచ్చారు.
గుత్తాకు నో
నల్గొండ నుంచి నరసింహారెడ్డికి అవకాశం కల్పించారు. ఇక్కడినుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు వినిపించినా .. చివరికి నరసింహారెడ్డి వైపు మొగ్గుచూపారు. గుత్తాకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి క్యేబినెట్ పదవీ ఉండటంతో టికెట్ ఇవ్వలేదు. సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ టికెట్ కేటాయించారు. ఇక్కడ బీసీలకు పట్టు ఉండటంతో సాయికి ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. నాగర్ కర్నూలు నుంచి మాజీ మంత్రి, సౌమ్యుడైన పోతుగంటి రాములుకు టికెట్ కేటాయించారు. ఇక్కడినుంచి బరిలోకి దిగాలని మందా జగన్నాథం ట్రై చేసినా .. ఆయన వైపు హైకమాండ్ మొగ్గుచూపలేదు. హైదరాబాద్ నుంచి పుస్తె శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.చేవేళ్ల నుంచి వ్యాపారి గడ్డం రంజిత్ రెడ్డికి అవాకాశం ఇచ్చారు. ఇక్కడినుంచి సబితా కుమారుడు కార్తీక్ రెడ్డికి టికెట్ ఇస్తారని ఊహాగానాలు వినిపించినా .. రంజిత్ రెడ్డికి అవకాశం వచ్చింది.