భారతి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా: కెసిఆర్
హైద్రాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మరణించడం పట్ల సీఎం కెసిఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతి కుటుంబానికి రూ. 25 లక్షలను ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మరణించడం పట్ల సీఎం కెసిఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతి కుటుంబానికి రూ. 25 లక్షలను ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ధర్నా: మహిళ మృతి, అసెంబ్లీలో విపక్షాల ఆందోళన
ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతిపై సభలో సీఎం కెసిఆర్ ప్రకటన చేస్తారని సభలో హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రకటించారు. అయితే ఈఘటనపై ఇంటలిజెన్స్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం సీఎం కెసిఆర్ ఈ ఘటనపై సభలో ప్రకటన చేశారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి కుటుంబానికి రూ. 25 లక్షలను ఎక్స్గ్రేషియా ప్రకటించనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. హైద్రాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నాలో భారతి చనిపోయిన విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ సమయంలో సభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతున్నారని సీఎం గుర్తుచేశారు.
అయితే ఈ ఘటనపై సమాచారాన్ని తెప్పించుకొన్న తర్వాత సభలో ప్రకటన చేయాలని ప్రభుత్వం భావించినట్టు చెప్పారు. ఈ మేరకు సభను వాయిదాను వేసి ప్రకటన చేస్తున్నట్టు కెసిఆర్ చెప్పారు.
భారతి చనిపోయిన విషయమై బాధాకరమైన ఘటనగా కెసిఆర్ చెప్పారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్కమిటీలో తాను కూడ ఆ సమయంలో కూడ సభ్యుడిగా ఉన్నానని చెప్పారు.వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.
మరోవైపు టిఆర్ఎస్ కూడ వర్గీకరణపై అనుకూలంగా ఉన్న విషయాన్ని సీఎం కెసిఆర్ చెప్పారు. మరో వైపు వర్గీకరణ విషయమై గతంలో పీఎం వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు. ఇదే సమయంలో సమయాన్ని కేటాయించాలని కోరినట్టు చెప్పారు.
అయితే సమయాన్ని కేటాయిస్తానని ప్రధానమంత్రి ప్రకటించారని కెసిఆర్ గుర్తు చేశారు. భారతికి పిల్లలుంటే వారి చదువుకొనే బాధ్యతను ప్రభుత్వమే తీసుకొంటుందని ప్రకటించారు. త్వరలోనే ప్రధానమంత్రిని కలిసేందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ భారతి కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడాన్ని అభినందించారు. అయితే భారతికి పిల్లలుంటే ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. అంతేకాదు సభను వాయిదా వేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇదే విషయమై బిజెఎల్పీ నేత కిషన్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు కూడ ప్రభుత్వం భారతి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలని కోరారు.