అభివృద్ధే ధ్యేయం.. రైతన్నకు మరో అభయం.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్..
హైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటేలా సాగుతున్నాయి. రాజధాని హైదరాబాద్లో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అవతరణ దినోత్సవంలో పాల్గొన్నారు. పబ్లిక్ గార్జెన్స్లోని జూబ్లీహాలులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. అంతకు ముందు గన్పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.
ఆరు దశాబ్దాల పోరాట ఫలితం.. ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనం...
ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ
దేశ చరిత్రలో ప్రత్యేక ఉద్యమాన్ని సాగించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత తెలంగాణ సొంతమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో ఎన్నో అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రం ఐదేళ్లలోనే 16.5శాతం వృద్ధి రేటు సాధించిందని కేసీఆర్ ప్రకటించారు.
అపహాస్యం చేసిన వాళ్లు అవాక్కయ్యేలా
ఎన్నో అప నమ్మకాలు, అనుమానాల మధ్య ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొద్దికాలంలోనే వాటన్నింటినీ పటాపంచలు చేసిందని కేసీఆర్ చెప్పారు. పాలన చేతకాదని, రాష్ట్రం విడిపోతే అంధకారం అలుముకుంటుందని, ప్రత్యేక రాష్ట్రంగా మనుగడే సాధించలేదని ఉమ్మడిపాలకులు చెప్పిన జోస్యాలను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. నవ్విన నాపచేనే పండిందన్నట్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంటే అది చేసి గతంలో వెక్కిరించిన వాళ్లు అవాక్కవుతున్నారని అన్నారు.
రైతులకు మరో లక్ష రుణమాఫీ
తెలంగాణలో ఐదేళ్ల కాలంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు కేసీఆర్. రాష్ట్రంలో అన్ని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నందున ఇకపై కరువనేది కనిపించదని చెప్పారు. రైతన్నను ఆదుకునేందుకు గతంలో రుణమాఫీ చేసిన టీఆర్ఎస్ సర్కారు.. త్వరలో మరో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. రైతుబంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికి ఇదే ప్రేరణ అని అన్నారు. రైతు బంధును ప్రపంచంలోనే గొప్ప పథకమని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
రాజకీయ అవినీతికి దూరం
రాజకీయ అవినీతికి దూరంగా బలమైన రాష్ట్రంగా తెలంగాణ నిలదొక్కుకుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని విజయం కట్టబెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తోందని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలు పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైందన్న ఆయన.. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రజా వైద్యంపై జనానికి నమ్మకం పెరిగిందని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు అందించడంతో పాటు.. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం సఫలమైందని కేసీఆర్ వివరించారు.
జవాబుదారీతనం పెంచే ప్రయత్నం
ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చినట్లు వివరించారు. గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అవినీతిని పాలద్రోలితో పాలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్న కేసీఆర్ ఇందుకోసం కొత్త రెవెన్యూ చట్టం రూపొందిస్తున్నామని అన్నారు.