సింగరేణి కార్మికులకు కెసిఆర్ వరాలు: సంస్థ లాభాల్లో 21శాతం, పన్ను రద్దు
హైదరాబాద్: సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. సంస్థ 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 21 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. సంస్థ కార్మికుల నుంచి వృత్తిపన్ను (ప్రొఫెషనల్ టాక్స్) రద్దు చేయాలని నిర్ణయించినట్లు గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సింగరేణిపై నిర్వహించిన సమీక్షలో చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఈ సంస్థ రూ.491 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇందులో 21 శాతం అంటే రూ.103.11 కోట్లను కార్మికులకు పంచాలని ఆయన సూచించారు. ఉమ్మడి రాష్ట్రమున్నప్పుడు సింగరేణి లాభాల్లో 18 శాతం సొమ్మును కార్మికులకు పంచేవారని, దానిని గతేడాది 20కి, ఇప్పుడు 21 శాతానికి పెంచినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
మొత్తం 60 వేల మంది కార్మికులు ఉన్నారని, ఒక్కో కార్మికునికి రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా అందే అవకాశాలున్నట్లు పేర్కొంది. తమ వేతనాల నుంచి వృత్తి పన్ను వసూలు చేయవద్దని కార్మికులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి డిమాండ్పై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వసూలును పూర్తిగా నిలిపివేయాలని సంస్థను ఆదేశించారు.
1990 నుంచి కార్మికుల నుంచి వసూలు చేయాల్సిన వృత్తి పన్ను బకాయిలు రూ.175 కోట్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ ఏడాది ఈ పన్ను రూపంలో రూ.15 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. దీని రద్దుతో కార్మికులకు ప్రయోజనం కలుగనుంది.
సమీక్ష సమావేశంలో సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, టిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.