హోంగార్డులపై కేసీఆర్ వరాల జల్లు: ఏమేం ప్రకటించారంటే..?
Recommended Video
హైదరాబాద్: హోంగార్డులపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు. ప్రగతి భవన్లో హోంగార్డులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. వారి జీతాలను రూ.20వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అలాగే ఏడాదికి రూ.వెయ్యి చొప్పున పెంపును అమలుచేయనున్నట్టు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో పనిచేసే హోంగార్డులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఒప్పంద అధ్యాపకులు, ఇతర సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
హోంగార్డులకు రిజర్వేషన్లు
మన ఆదాయం అంతా మన ప్రజలకు చెందాలనే లక్ష్యంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని సీఎం స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి ప్రత్యేక కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రిజర్వ్డ్ కానిస్టేబుళ్ల నియామకంలో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. డ్రైవర్ల నియామకంలో హోంగార్డులకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. రోస్టర్ విధానం లేకుండా ఎలాంటి నియామక ప్రక్రియ జరగొద్దని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. రోస్టర్ అమలు చేస్తూనే హోంగార్డులపై నియామక అధికారులు కాస్త దయ చూపాలన్నారు. పరీక్ష కూడా సాధారణ అభ్యర్థులతో కాకుండా హోంగార్డులకు ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్దేశించారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే హోంగార్డులకు వయోపరిమితి 40 ఏళ్లకు పెంచుతామన్నారు.
కోరుకున్న చోట డబుల్ బెడ్రూం ఇళ్లు
కమ్యూనికేషన్ విభాగంలో హోంగార్డులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తాం. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని అలవెన్సులు పెంచినట్లు సీఎం చెప్పారు. పెంచిన అలవెన్సులు 2018 జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే హోంగార్డులకు శాశ్వత ఉద్యోగితో సమానంగా అలవెన్సు ఇస్తామని వెల్లడించారు. నగరంలో పనిచేసే హోంగార్డులకు బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తామని..18,900 మంది హోంగార్డులకు కోరుకున్న చోట డబుల్బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. నగరశివారు కొల్లూరు వద్ద 15వేల ఇళ్ల నిర్మాణానికి స్థలం పరిశీలించామన్నారు.
పోలీసులతో సమానంగా..
పోలీసు, హోంగార్డుల కుటుంబానికి మంచి వైద్యబీమా సదుపాయం కల్పిస్తామని సీఎం పేర్కొన్నారు. పోలీసు ఆస్పత్రుల్లో పోలీసులతో సమానంగా హోంగార్డులకు వైద్య సదుపాయాలు అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ మహిళా పోలీసులతో సమానంగా మహిళా హోంగార్డులకు 6 నెలల ప్రసూతి సెలవు ఇవ్వనున్నట్లు తెలిపారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరూ వెట్టిచాకిరీ చేయకూడదని సీఎం అన్నారు.
ప్రతిపక్షాల వల్లే..
చాలా విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేలల్లో ఉన్నారని, అసలు పరిస్థితి మీకు అర్థం కావాలనే అందరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నట్లు
సీఎం కేసీఆర్ హోంగార్డులకు వివరించారు. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నాయన్నారు. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణను కోర్టు కొట్టివేసినప్పుడు తాను చాలా ఆవేదనకు గురైనట్టు తెలిపారు.