నాయినికి షాక్, ముఠా గోపాల్కే టిక్కెట్: టీడీపీలో రాలేదని ఏడ్చిన నేతకు టీఆర్ఎస్ టిక్కెట్
హైదరాబాద్: నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అందరి అభ్యర్థులను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 117 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆదివారం మిగతా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దీంతో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించినట్టయింది.
ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్, కోదాడ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్కు టిక్కెట్ కేటాయించారు. దీంతో మొత్తం 119 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ముఠా గోపాల్, మల్లయ్య యాదవ్ ఆయా నియోజకవర్గాల్లో సోమవారం నామినేషన్లు వేస్తారు.
నాయిని చేతుల మీదుగా ముఠా గోపాల్కు బీఫాం
ముషీరాబాద్ నియోజకవర్గం టికెట్ను తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఇప్పించుకునేందుకు నాయిని నర్సింహా రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిపై కేసీఆర్ ఆయనను బుజ్జగించి ముఠా గోపాల్ను ఫైనలైజ్ చేశారు. ఈ టికెట్ కేటాయింపు విషయమై చివరిక్షణం వరకు నాయిని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. నాయిని చేతుల మీదుగానే ముఠా గోపాల్ బీఫారం తీసుకోనున్నారు.
టీడీపీ టిక్కెట్ రాలేదని ఏడ్చి, తెరాసలో చేరిన రెండ్రోజులకే
మరోవైపు, మల్లయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి కోదాడ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. తనకు టిక్కెట్ రానందుకు ఇటీవల ఆయన కంటతడి పెట్టారు కూడా. మహాకూటమి పొత్తులో భాగంగా ఆయనకు టిక్కెట్ రాలేదు. ఈ స్థానం కాంగ్రెస్కు వెళ్లింది. దీంతో రెండు రోజుల క్రితం ఆయన తెరాసలో చేరారు. పార్టీలో చేరిన రెండు రోజులకే ఆయనకు టిక్కెట్ వచ్చింది. కోదాడ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు. ఇక్కడ గట్టి పోటీ ఇవ్వాలని మల్లయ్య యాదవ్కు టిక్కెట్ ఇచ్చారు.
జన సమితి బీఫారాలు, టీడీపీ కేటాయించిన స్థానంలో కూడా
మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగామ జన సమితి ఏడు నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చింది. మెదక్, సిద్దిపేట, దుబ్బాక, మల్కాజిగిరి, వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ నియోజకవర్గాల అభ్యర్థులకు ఆ పార్టీ అధ్యక్షులు కోదండరాం బీఫారం ఇచ్చారు. కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించిన మహబూబ్ నగర్ స్థానం నుంచి కూడా టీజేఎస్ తమ పార్టీ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడం గమనార్హం. మిర్యాలగూడ స్థానంలో తన కొడుకుతో పోటీ చేయించాలని జానారెడ్డి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. అది టీజేఎస్కే దక్కింది.
కాంగ్రెస్లో బుజ్జగింపులు
మరోవైపు, నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో గొడవ మాత్రం కొనసాగుతోంది. మరో ఆరేడు స్థానాలపై చర్చలు, బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. కృష్ణారావు, డీకే శివకుమార్, నారాయణ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలను బుజ్జగించే ప్రక్రియ కొనసాగింది. గాంధీ భవన్ వద్ద ఆధివారం కూడా నిరసనలు కొనసాగాయి.
కార్తీక్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం
టిక్కెట్లు, కూటమిలో ఇతర పార్టీలకు సీట్లు వెళ్లడంపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓడిపోతామని తెలిసి కూడా రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం టిక్కెట్లను తెలుగుదేశం పార్టీలకు ఎందుకు కేటాయించారని సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి వాపోయారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారితో భేటీ అయ్యాక తన నిర్ణయం చెబుతానన్నారు. ఆయన మెత్తబడినట్లుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం సీటు నాదేనని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బీఫారం తనకే వస్తుందని చెప్పారు. గెలిచే వాళ్లకు టిక్కెట్ ఇవ్వాలని పార్టీకి సూచించానని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో గెలిచేది నేనేనని, గెలిచి వస్తానని వ్యాఖ్యానించారు. పోటీ చేయనని చెప్పిన సామ తెరాసకు పావులా మారారని ఆరోపించారు.