కేసీఆర్ అప్పాయింట్ మెంట్ కష్టం..! గులాబీ పార్టీలో కలకలం రేపుతున్న నాయిని వ్యాఖ్యలు..!!
హైదరాబాద్: గులాబీ పార్టీలో హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి మరోసారి తన అసహనాన్ని వెళ్లగక్కారు. తన మనసులో మాట చెప్పుకోవడానికి ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అసలు సమయం ఇవ్వడం లేదని కార్యకర్తల ముందు ఆవేదన వ్యక్తం చేసారు. నాయిని మొన్నచిక్కడపల్లిలో ఒక జిమ్ ప్రారంభించడానికి అల్లుడితో వచ్చిన సందర్భంగా అక్కడ పార్టీ నేతలు, ఆయన అభిమానులతో మాట, ముచ్చట కలిపారు. అందులో కొందరు నర్సన్నా... ముషీరాబాద్ టిక్కెట్ ఏమైందే... సీయం నీకు బాగా దగ్గర కదా... టిక్కెట్ నీ అల్లునికే ఇప్పియచ్చు కదనే అని రాజకీయల గురించి ప్రస్తావన తెచ్చారు. అంతే నాయిని తన మనసులో ఉన్నదంతా వెళ్లబోసుకున్నారు.
కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం లేదు..! దుమారం లేపుతున్న హోంమంత్రి వ్యాఖ్యలు..!!
ఈ క్రమంలో కేసీఆర్ నొచ్చుకునేలా ఒకట్రెండు ఇబ్బందికర వ్యాఖ్యలు కూడా యథాలాపంగా చేసేశారు నాయిని. తాను ఏడికి పోయినా బంధువులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని, నువ్వండగా ముషీరాబాద్ టిక్కెట్ విషయం పెండింగ్ పెట్టుడేందే అని ప్రశ్నిస్తున్నారని, ఆ ప్రశ్నకు తాను జవాబు చెప్పలేకపోతున్నానని తమ మనుసులో ఉన్న బాధను చెప్పేశారు నాయిని. తన అల్లుడు శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంలో అప్ సెట్ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ముషీరాబాద్ పై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారా అని తాను కూడా ఎదురు చూస్తున్నా అన్నారు. అయితే తనకు చప్పకుండా ముషీరాబాద్ టిక్కెట్ విషయంలో నిర్ణయం తీసుకోనని కేసీఆర్ తనకు మాట ఇచ్చినట్లు నాయిని చెప్పారు.
ఓ పక్క ఐటీ దాడులు..! మరో పక్క కోట్ల వ్యవహారం బయటపెట్టిన నాయిని..!!
ఈ సందర్భంగా 2014లో జరిగిన ఎన్నికలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 2014లో తాను ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే కేసీఆర్, వద్దు నర్సన్న నిన్ను గతంలో ఓడగొట్టారు, అందుకని నువ్వు ఈ సారి ఎల్.బీ.నగర్ నుంచి పోటీ చెయ్యి అని చెప్పారని తెలిపారు. అయితే బాగా డబ్బున్న సుధీర్ రెడ్డిపై కొట్లాడే సామర్ధ్యం తనకు లేదంటే, నీకెందుకే నీ తమ్ముడ్ని నేనున్న పది కోట్లు ఇస్తా పోటీ చెయ్ అని చెప్పిన చంద్రశేఖర్ రావు వాఖ్యలను గుర్తు చేసారు నాయిని.
ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాలు ఇచ్చిన నాయిని.! కేసీఆర్ తీరుపై నర్మగర్బ వ్యాఖ్యలు..!!
అయినా ఎల్.బీ.నగర్ నుంచి పోటీ చెయ్యడానికి తాను విముఖత వ్యక్తం చెయ్యడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్ విషయం మాట్లాడటానికి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాని, కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని చిక్కడపల్లి కార్యక్రమంలో మీడియా సమక్షంలో కార్యకర్తలు, అబిమానులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేసారు నాయిని నర్సింహారెడ్డి.
కేసీఆర్ నైజాన్ని బహిర్గతం చేసిన నాయిని..! ఎలా సమర్థించుకుంటారో..!!
అయితే ఇక్కడ రెండు విషయాలు ఆయన యాద్రుశ్చికంగా వ్యాఖ్యానించినా.. అవి పార్టీ శ్రేణుల్లో, రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అందులో ప్రధానమైనది.. 2014లోనే నాయిని నర్సింహరెడ్డి ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్ పది కోట్లు ఇస్తా అన్నారంటే, ఒక సారి అధికారం అనుభవించిన తరువాత.. వచ్చే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఇంకెంత ఖర్చు పెడతారో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక నాయిని వ్యాఖ్యలతో సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరక్క ఎదురు చూడాల్సిన పరిస్ధితి ఉందన్న భావన కార్యకర్తలను, ప్రజలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ రెండు అంశాలను ప్రతిపక్షాలు రాజకీయంగా ఏ విధంగా వాడుకుంటాయో చూడాలి.