కెసిఆర్ కూడా కూలీకి వెళ్లి సంపాదిస్తారు: ఎందుకంటే...
కెసిఆర్ రెండు రోజుల పాటు కూలీ పనులు చేసి పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ కోసం డబ్బులు సంపాదిస్తారు. పార్టీ నాయకులు రెండు రోజుల పాటు కూలీ పనులు చేస్తారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు రోజుల పాటు కూలీకి వెళ్లి నిధులు సమకూరుస్తారు. తెరాస పార్టీ అవిర్భావ దినోత్సవం, ప్లీనరీ ఖర్చుల కోసం ఎప్పటి మాదిరిగానే తనతో పాటు పార్టీ నేతలంతా రెండు రోజుల పాటు కూలీ పనులు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. గతంలో కూడా కెసిఆర్ కూలీ పనులు చేశారు.
బుధవారం మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత ఆయన పార్టీ ప్లీనరీ, వరంగల్లో జరుగబోయే బహిరంగ సభ వివరాలను మీడియాకు వివరించారు. పార్టీ 16 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఖర్చుల కోసం డబ్బుల సమీకరణ కోసం రాష్టవ్య్రాప్తంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 'గులాబి కూలీ దినాలు' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు చెప్పారు.
దీంట్లో భాగంగా తాను కూడా రెండు రోజుల పాటు కూలీ పనులకు వెళ్తానని చెప్పారు. పార్టీ నేతలు కూడా ప్రతీ ఒక్కరు రెండు రోజుల పాటు కూలీ పనులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లక్షల మంది హాజరయ్యే ప్లీనరీ, బహిరంగ సభ నిర్వహణ ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు గతంలో మాదిరిగానే కూలీ పనులు చేయనున్నట్లు తెలిపారు. సభకు వచ్చే వారి భోజనం, రవాణా ఖర్చులను ఎవరంతకు వారే భరించడానికి కూలీ పనులు ప్రతీ ఒక్కరూ చేయాల్సిందేనని కెసిఆర్ అన్నారు.
పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిందని, రికార్డు స్థాయిలో 75 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారన్నారు. రాష్ట్ర జనాభా 3 లక్షల 64 మంది కాగా అందులో టిఆర్ఎస్ సభ్యత్వాన్ని 75 లక్షల మంది స్వీకరించారని చెప్పారు. దీంతో పార్టీ సభ్యత్వాల సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు.
సభ్యత్వ రుసుం కింద రూ. 25 నుంచి 30 కోట్ల వరకు పార్టీకి డబ్బు రానుందని, ఇప్పటికే రూ. 13 కోట్లు రాగా పార్టీ ఖాతాలో జమా చేశామన్నారు. ఈ నెల 21న హైదరాబాద్లో పార్టీ ప్లీనరీ, పార్టీ అవిర్భావం రోజు 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుని ఎన్నిక నిర్వహించడానికి నాయిని నరసింహరెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గతంలో కూడా పార్టీ అధ్యక్షుని ఎన్నికలను నాయిని నిర్వహించారని గుర్తు చేశారు.