సెటిలర్స్పై కేసీఆర్ 'సికింద్రాబాద్' ఆపరేషన్: కాంగ్రెస్లోనే ఉంటా కానీ: జయసుధ
హైదరాబాద్: సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ సినీ నటి జయసుధ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పడం, ఇటీవలి కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బస్తీల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తాజాగా, జయసుధ తెరాసలో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది తెరాస వ్యూహాత్మక వైఖరేననే వాదనలు వినిపిస్తున్నాయి. జయసుధ సెటిలర్ కాబట్టి ఆమెను తెరాసలోకి తీసుకుంటే అలాంటి వారికి ధీమాను కల్పించినట్లవుతుందని తెరాస భావిస్తుండవచ్చునని అంటున్నారు.
అలాగే, నగరంలో ఉన్న క్రిష్టియన్ మైనార్టీ ఓట్లను ఆకర్షించే ఉద్దేశ్యంలో భాగంగా కూడా జయసుధను పార్టీలోకి తీసుకోవాలని చూస్తుండ వచ్చునని అంటున్నారు. ఇప్పటికే మజ్లిస్ పార్టీతో దోస్తీ ద్వారా ముస్లీం మైనార్టీలను తెరాస ఆకర్షిస్తోంది.
ఇప్పుడు జయసుధను పార్టీలో చేర్చుకోని క్రిష్టియన్ మైనార్టీలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్లో చేరిక ఊహాగానాలపై జయసుధ స్పందిస్తూ.. తనను ఇంఛార్జిగా తొలగించాలని తానే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరానని, తనకు తెరాస నుండి ఇప్పటి వరకు ఆహ్వానం లేదని, వస్తే స్పందిస్తానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, జయసుధ చేరుతారా లేదా అనేది చూడాలి.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో జయసుధ ఇమిడినట్లుగా కనిపించడం లేదు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ నుండి పోటీ చేసి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతి తర్వాత కొద్ది రోజులకు జయసుధకు రాజకీయాల పైన వెగటు పుట్టిన విషయం కూడా తెలిసిందే.
దానికి తోడు, మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డితో విభేదాలు ఉన్నాయి. అంతేకాదు, సీనియర్ నేతలతో జయసుధ కలవడం లేదనే వాదనలు ఉన్నాయి. వైయస్ మృతి అనంతరం ఆమె ఓ సమయంలో జగన్ వైపు వెళ్లి, తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అయితే, రాజకీయాల్లో తన అసంతృప్తిని మాత్రం అప్పుడప్పుడు వెళ్లగక్కారు.
అయిష్టంగానే రాజకీయాల్లో లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, రాజకీయాల పైన అసంతృప్తి వ్యక్తం చేసిన జయసుధ ఇప్పుడు అధికార తెరాస వైపు చూస్తుండటం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జయసుధ చేరిక తమకు కలిసి వస్తుందని తెరాస భావిస్తోందని సమాచారం.
పార్టీలోనే జయసుధ
సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జయసుధ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నాడు తన తనయుడి చిత్రం బస్తీ ఆడియో వేడుక కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జయసుధ పైన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, తెరాస ఆహ్వానిస్తే ఆమె కారు ఎక్కవచ్చుననే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆమె పైన సస్పెన్షన్ వేటు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధపడిందని వినిపించాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలు జయసుధతో ఫోన్లో మాట్లాడారు.
తాను పార్టీలోనే ఉంటానని ఆమె వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏ ఎన్నికల్లోను తాను పోటీ చేయనని చెప్పారని సమాచారం. సికింద్రాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. మంగళవారం పూర్తి వివరణ ఇవ్వాలని ఉత్తమ్, జానాలు కోరారు.