కేసీఆర్ బయోపిక్: తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నదెవరు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ను త్వరలోనే ప్రారంభిస్తామని, ఇది ఒక్క తెలుగు భాషలోనే కాకుండా, పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని దర్శక నిర్మాత మధుర శ్రీధర్ ప్రకటించినట్లు ఆంధ్రప్రభ ఒక కథనం ప్రచురించింది.
ఇందుకు సంబంధించిన స్క్రిప్టు సిద్ధంగా ఉందని, బడ్జెట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పినట్లు ఆంధ్రప్రభ కథనం పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలు కావచ్చన్న మధుర శ్రీధర్, ఈ సినిమాలో భాగస్వామ్యం కోసం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
గతంలో కేసీఆర్ పాత్రకోసం ఓ బాలీవుడ్ నటుడిని పేరును ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే నటుడితో వెళతారా లేదా అన్నది స్పష్టం కాలేదని ఈ కథనం పేర్కొంది.
కేసీఆర్ రూపురేఖలతో ఉండే నటుడి కోసం అన్వేషణ సాగుతోందని, ఇంకా ఇందులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కిరణ్కుమార్ రెడ్డి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాత్రలు కూడా ఉండనున్నట్లు సమాచారం.
ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సిందే -సెప్టెంబర్కల్లా పూర్తి చేయాలన్న యూజీసీ
డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణపై కేంద్రం స్పష్టత ఇచ్చిందని, అన్ని కోర్సుల ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్కల్లా నిర్వహించుకోవడానికి హోంశాఖ అనుమతి ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
కేంద్రం అనుమతితో పరీక్షల నిర్వహణకు యూజీసీ మార్గదర్శకాలను జారీ చేసినట్లు ఈ కథనంలో పేర్కొంది. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ సెప్టెంబర్లోగా పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత ఉండగా, ఈ పరీక్షలు రాయాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పినట్లయింది. వాస్తవానికి జులై నాటికి పరీక్షలు పూర్తి చేయాల్సిన ఉండగా, కరోనా తీవ్రత దృష్ట్యా వాటిని వాయిదా వేసింది యూజీసీ. ఇప్పుడు కేంద్రం అనుమతితో అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు పరీక్షలకు ఏర్పాట్లు చేసుకోవాలని యూజీసీ సూచించింది.
వీసాలకు గడ్డుకాలం -నిబంధనలను కఠినం చేస్తున్న అమెరికా
పెరుగుతున్న నిరుద్యోగాన్ని కారణంగా చూపి హెచ్1బీ వీసాల నిబంధనలను మార్చిన అమెరికా మరికొన్ని వీసాల నిబంధనలను కూడా కఠినతరం చేయబోతోందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం రాసింది.
ఈ కథనం ప్రకారం '2020 స్ప్రింగ్ ఎజెండా'లో వీసా నిబంధనల్లో మార్పులకు సంబంధించి ప్రతిపాదనలను చేసినట్లు ఈ కథనం పేర్కొంది.
ఇకపై హెచ్1బీ వీసాల నిర్వచనాన్ని కూడా మార్చనున్నట్లు, అత్యంత నైపుణ్యం ఉన్నవారికే ఈ వీసాలు మంజూరు చేస్తారని, వీసా దరఖాస్తు చేసుకునే సమయానికి కంపెనీ అతని జీతాన్ని పెంచి ఉండాలన్న నిబంధనను కూడా చేర్చనుంది.
ఇక హెచ్4 వీసాలను పూర్తిగా రద్దు చేయనున్నట్లు, స్టూడెంట్ వీసాలపై నిర్దిష్ట గడువును కూడా విధించనున్నట్లు ఈ కథనం పేర్కొంది.
గాలి ద్వారా కరోనా- మార్గదర్శకాలు మార్చాలన్న సైంటిస్టులు
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని 32 దేశాలకు చెందిన 239మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసినట్లు ఈనాడుతోపాటు పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి.
ఇప్పటి వరకు వ్యాధిగ్రస్తులు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారానే కరోనా వైరస్ మరొకరికి సోకుందని భావించారని, అది వాస్తవమే అయినా గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుందని వారు ఆలేఖలో పేర్కొన్నారు.
ఐదు మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న తుంపర్లు గాలిలో మీటరుకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని, ఇవి మరొకరిని చేరినప్పుడు వారికి వ్యాధి సంక్రమిస్తుందని ఆ లేఖలో శాస్త్రవేత్తలు తెలిపారు.
దీనినిబట్టి మాట్లాడినప్పుడు, శ్వాస వదిలినప్పుడు వెలువడే సూక్ష్మ తుంపర్లు కూడా వైరస్ సోకడానికి కారణమవుతాయని వారు హెచ్చరించారు.
అందువల్ల కరోనా జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు వారు విజ్జప్తి చేశారు. శాస్త్రవేత్తల లేఖను పరిశీలిస్తామని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)