కేసీఆర్ బర్త్ డే ఫ్లెక్సీ కటౌట్: మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ జరిమానా
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు జీహెచ్ఎంసీ షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు జరిమానా విధించింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో 'వియ్ లవ్ కేసీఆర్' అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే, ఈ ఫ్లెక్సీలకు అనుమతి లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. రూ. 5 వేలు చెల్లించాలంటూ మంత్రి తలసానికి నోటీసులు పంపారు. కాగా, కేసీఆర్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఐమాక్స్ సమీపంలోని కూడలి వద్ద జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో ఉన్న పార్కులో ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీలో మొక్కలు నాటాలంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే, ఇందుకు జీహెచ్ఎంసీ అనుమతి లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ మేరకు జరిమానా విధిస్తూ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లపై చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఇలా అనుమతిలేని ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసిన వారికి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానాలు విధించారు. ఈ జరిమానాలు ఎదుర్కొన్నవారిలో ఎక్కువగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉండటం గమనార్హం. అయితే, తాజాగా ఏకంగా మంత్రికే జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా వేయడంపై అటు టీఆర్ఎస్, ఇటు ప్రభుత్వంపై సానుకూల వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో అందరూ సమానమేనని మరోసారి రుజువైందని టీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 17న 66వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా బొకేలు, ఫ్లెక్సీలు పెట్టడం బదులు మొక్కలను నాటాలను కేసీఆర్ గతంలోనే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.