కోర్ట్ ఆదేశాలను కేసీఆర్ ఉల్లంఘించారు..! మరోసారి మండి పడ్డ రేవంత్ రెడ్డి..!!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు అధికార కాంక్ష తప్ప పాలనా కాంక్ష గాని, చట్టంపై- రాజ్యాంగంపై అవగాహన గాని లేవని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సభాపతితో రహస్యంగా విలీనం చేయడం చంద్రశేఖర్ రావు తెలివతక్కువ తనానికి నిదర్శనం అన్నారు. పార్టీ విలీన ప్రక్రియ ఇపుడు చంద్రశేఖర్ రావు చేసినట్లు, చేయించినట్లు ఉండదన్నారు. విలీనం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి చేతుల్లో మాత్రమే ఉంటుందన్నారు. స్పీకర్ పరిధిలో విలీనం ఉంటుందో లేదో కూడా తెలియని ముఖ్యమంత్రి తెలంగాణను పాలిస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేసారు.
అసలు తన పరిధిలో లేని అధికారాలతో విలీన ప్రక్రియ చేపట్టి స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరు నిబంధనలు అతిక్రమించారని రేవంత్ విమర్శించారు. దీనికి సంబంధించి ఉదాహరణ కూడా ఇచ్చారు. 2016లో టీడీపీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను విలీనం చేస్తూ బులెటెన్ ఇచ్చారని... అపుడు దానిని తాను హైకోర్టులో సవాల్ చేశానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కోర్టు దానిపై స్పందిస్తూ 90 రోజుల్లో అనర్హత పిటిషన్లను పరిష్కరించాలని ఆదేశాలిచ్చిందని చెప్పారు. ఆ లెక్కన చంద్రశేఖర్ రావు కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించారన్నారు. అసలు ఎమ్మెల్యేలను బెదిరించి విలీనానికి ఒత్తిడి తెచ్చారని, చంద్రశేఖర్ రావు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ప్రజలు హర్షిస్తారా అని రేవంత్ ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ నిరసన తెలిపిన వారిలో ఉన్నారు. అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముందుగా అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నిరసన తెలపాలని భావించినా..అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు.
దీంతో గేటుకు ఎదురుగా నడిరోడ్డుపై కూర్చుని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. తెలంగణలో ప్రజా స్వామ్యం ఖూనీ అయ్యింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని వారు ప్రశ్నించారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19మంది ఎమ్మెల్యేలు గెలవగా ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలి ఉన్న విషయం తెలిసిందే..!