ఏపీ రైతులూ బాగుండాలి, అవి మీవే: బాబుకు కేసీఆర్ సూచన
హైదరాబాద్: రైతుల కోసం ఎంతైనా చేస్తామని, రెండు తెలుగు రాష్ట్రాల రైతులు బాగుండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. ఆయన ప్రాజెక్టుల పురోగతి పైన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
గోదావరి, కృష్ణా నదుల ద్వారా ఏటా 4500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని, తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పూర్తయినా వెయ్యి టీఎంసీలు మాత్రమే వాడుకోగలమన్నారు. రీడిజైన్ ద్వారా సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సమర్థంగా వినియోగించుకోగలుగుతామన్నారు.
ఏపీ కూడా ఈ నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని హితవు పలికారు. రెండు రాష్ట్రాల రైతులు బాగుండాలన్నారు. తెలంగాణలో ప్రాజెక్ట్ల రీ డిజైనింగ్ వల్ల ఒక్క మన రాష్ట్రమే కాదు ఏపీ రైతులు కూడా బాగుపడుతారన్నారు.
తెలంగాణలో ప్రాజెక్ట్ల రీ-డిజైనింగ్ చేయడం ద్వారా సముద్రంలోకి పోయే నీటిని సమర్థంగా ఉపయోగించుకోగలమన్నారు. తెలంగాణలో ప్రాజెక్ట్లు మొత్తం పూర్తయినా కేవలం వేయి టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతామని, వాటితోనే కోటి ఎకరాలకు నీరందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మిగతా నీటిని ఏపీ వాడుకోవచ్చన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా చక్కగా ప్రణాళిక వేసుకుంటే సముద్రంలోకి వెళ్లే నీటిని పొలాల్లోకి మళ్లించుకోవచ్చని సూచించారు. రైతులు ఎవరైనా రైతులేనని అన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించడమే ధ్యేయంగా బడ్జెట్లో భారీ ఎత్తున నిధులను మంజూరు చేసిందన్నారు.
కాళేశ్వరం, పాలమూరు, డిండి, భక్తరామదాసు ప్రాజెక్ట్ల పురోగతిపై ముఖ్యమంత్రి గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మరోవైపు, కేసీఆర్ గవర్నర్ నరసింహన్తోను భేటీ అయ్యారు. ప్రాజెక్టుల పురోగతిని ఆయనకు వివరించారు. అలాగే, తన ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించారు. ఈ నెల 24న సాయంత్రం గవర్నర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.