ఢిల్లీలో కేసీఆర్ బిజీబీజీ: అసెంబ్లీని రద్దు చేస్తే ఏమౌతుంది? ఇవీ పరిణామాలు!
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం నాడు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కలిశారు. ఆయన జైట్లీతో దాదాపు 15 నిమిషాలు మాట్లాడారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదలపై చర్చించారు.
Recommended Video
ఓ వైపు అసెంబ్లీ రద్దుపై చర్చ సాగుతుండగా కేసీఆర్ ఢిల్లీలో బీజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులను కలవడంపై చర్చ సాగుతోంది. ముందస్తుకు మొగ్గు చూపుతున్న కేసీఆర్.. ఎన్నికల సంఘం నిబంధనాల్లో చిక్కుకోవద్దని భావిస్తున్నారట.
అసెంబ్లీ రద్దుపై ఇదీ విషయం
అసెంబ్లీ రద్దయిన తర్వాత 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, అందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఏమీ ఉండదని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగడం కేసీఆర్కు ఇష్టంలేదని, అందుకే ఒకటి రెండు నెలల ముందుగానే తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన యోచిస్తున్నారని అంటున్నారు. రాజ్యాంగంలో కానీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోకానీ అసెంబ్లీ రద్దయిన తర్వాత ఎన్ని నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న స్పష్టత లేకపోయినా గుజరాత్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఉదహరిస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ 10లోపు అసెంబ్లీ రద్దు చేస్తే ఆరు నెలల్లోపు ఎన్నికలు పూర్తి చేసి కొత్త అసెంబ్లీ ఏర్పాటు చేసే అవకాశముందని అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం ఒక అసెంబ్లీ సమావేశానికి, మరో అసెంబ్లీ సమావేశానికి మధ్య గరిష్ఠంగా ఆరునెలల గడువు తప్పనిసరి. ఆ నిబంధనకు లోబడి అసెంబ్లీ రద్దయిన 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు గుజరాత్ కేసులో చెప్పిందని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు వద్దని ఆయన కోరుకుంటున్నారని తెలుస్తోంది.
ఆ నిబంధన లేదు కానీ
అసెంబ్లీని రద్దు చేసి రద్దు చేసి ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తే ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ రద్దు అయితే ఆరు నెలల్లోగానే ఎన్నికలు నిర్వహించాలనే స్పష్టమైన నిబంధన లేదని అంటున్నారు. ఆరు నెలలు దాటితే రాష్ట్రపతి పాలన వస్తుందని, ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా ఆరు నెలలే ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏదైనా స్థానం ఖాళీ అయినప్పుడు ఆరు నెలల్లో భర్తీ చేయాలన్న నిబంధన ఉంది. దానినే ప్రామాణికంగా తీసుకోవచ్చునని భావిస్తున్నారు.
ఆ నిబంధన ఉంది
అయితే, ప్రతి ఆరు నెలలకు ఓసారి అసెంబ్లీ సమావేశం జరగాలనే నిబంధన ఉంది. అసెంబ్లీ రద్దు అనంతరం ఆరు నెలల్లోగా సమావేశం జరగని పక్షంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. బడ్జెట్ ఆమోద వ్యవహారాలను పార్లమెంటు ఖరారు చేస్తుంది. ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా సాధారణ పరిస్థితుల్లో ఆరు నెలలపాటు ఉంటుంది.
సమావేశాలపై నిబంధన ఇలా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఈ ఏడాది మార్చి 13న సమావేశమై మార్చి 29న ముగిసింది. ఆరు నెలల్లో అంటే ఈ ఏడాది సెప్టెంబరు 28లోగా సమావేశం నిర్వహించాలనేది నిబంధన ఉంది. అసెంబ్లీ సమావేశం నిర్వహించకుండా రద్దు చేసిన పక్షంలో అంతకు ముందటి సమావేశాన్ని.. అంటే మార్చి సమావేశాలను పరిగణనలోకి తీసుకుని ఆరు నెలలను లెక్కిస్తారు. ఆరు నెలలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తారు. సెప్టెంబరు మూడో వారంలో సమావేశం నిర్వహించి రద్దు చేస్తే ఆరు నెలలు అంటే మార్చి మూడో వారం వరకు ప్రస్తుత ప్రభుత్వమే ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటుంది. ఏదేమైనా ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయంగా ఉంటుంది.