విమానం కొంటున్న కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు తర్వాత జాతీయస్థాయిలో సభలు, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దేశం మొత్తం పర్యటించాలంటే హెలికాప్టర్కానీ, విమానం కానీ అవసరమవుతుంది. దీనికోసం సొంతంగా పార్టీకి విమానం సమకూర్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. 12 సీట్లున్న విమానం ఖరీదు రూ.80 కోట్లుగా ఉంది. నిధులను పార్టీ నేతల నుంచి విరాళాల రూపంలో సేకరించాలని నిర్ణయించారు. విరాళాలివ్వడానికి గులాబీ పార్టీ నేతలు పోటీపడుతున్నారు. పార్టీ వద్ద ఇప్పటికి రూ.865 కోట్ల నిధులున్నాయి. వీటిని జాతీయస్థాయి సభలు, సమావేశాలకు, పార్టీ సంబంధిత ఖర్చులకు వినియోగించనున్నారు.
కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. నరేంద్రమోడీ, అమిత్ షా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, నియంతృత్వ ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఎక్కడో ఒకచోట దీనికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న కేసీఆర్ మూడోసారి విజయం సాధించకుండా మోడీ, షా ద్వయాన్ని నిలువరించడానికి జాతీయస్థాయిలో పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిద్వారా అన్ని ప్రాంతీయపార్టీలను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పాటైతేనే వారిని నిలవరించగలమని కేసీఆర్ భావిస్తున్నారు.