కేసీఆరూ.. కారూ.. పదహారూ.. నినాదానికి బంగపాటు తప్పదా..? తెలంగాణలో వినిపిస్తున్న భిన్న స్వరాలు..!!
హైదరాబాద్ : గులాబీ బాస్ కల నెరవేరుతుందా..? యువ వర్కింగ్ ప్రసిడెంట్ కష్టం ఫలితం తెచ్చిపెడుతుందా..? నిజామాబాద్ లో ఎంపీ కవిత పరువు నిలబడుతుందా..? రాజకీయంగా తమకు తిరుగులేదని చాటుకుంటున్న ఆత్మవిశ్వాసం కొనసాగుతుందా..? 16 ఎంపీ సీట్ల చుట్టూ.. టీఆర్ఎస్ రాజకీయం తిరుగుతుంది. కీలకమైన పార్లమెంటరీ స్థానాల్లో భారీగా తగ్గిన ఓటింగ్ సరళికి కారణం ఏంటి ? లోకల్ ఎమ్మెల్యేలను సీయం చంద్రశేఖర్ రావు టార్గెట్ చేసినందుకు వారి నుండి వచ్చిన వ్యతిరేకత దీనంతటికీ ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల్లో కారు రివర్స్ గేర్..! 16సీట్ల గెలుపుపై భిన్న వాదనలు..!!
నిఘా వర్గాల నివేదికలు కూడా కారు వేగానికి బ్రేకులు పడ్డాయంటూ తేల్చిచెప్పటంతో చంద్రశేఖర్ రావు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ బతుకమ్మ అంబాసిడర్ కవితకు ఎదురైన అనుభవాలే గులాబీ వనంలో చిచ్చు రేగడానికి కారణంగా చర్చ జరుగుతోంది. ఎక్కడ పోలింగ్ కేంద్రాలకు వెళ్లినా ఎందుకొచ్చావని మహిళలు నిలదీయడంతో అదికార గులాబీ పార్టీ కష్టాలను కొనితెచ్చుకున్నట్టైందని ప్రచారం జరుగుతోంది.
నివురుగప్పిన నిప్పులా నిజామాబాద్..! సరిగ్గా అక్కడనుంచే ప్రారంభమైన వ్యతిరేకత..!!
సొంత కూతురికే ఇటువంటి వ్యతిరేకత ఎదురైతే.. 16 ఎంపీ సీట్లు గెలవటంపై అనేక సందేహాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో హైదరాబాద్ స్థానంలో కూడా టీఆర్ఎస్ పోటీ చేసినా.. కేవలం అదంతా హిందువుల ఓట్లను చీల్చటం కోసమే అనేది బహిరంగ రహస్యం. పైగా అసదుద్దీ,న్ ఓవైసీ, గులాబీ పార్టీ కలిసి తెలంగాణలో బాగానే ప్రచారం చేశాయి. అంతే కాకుండా ఇటీవల ఓ బహిరంగ సభలో చంద్రశేఖర్ రావు, హిందువుల గురించి చేసిన కామెంట్స్ కూడా ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది.
వాడి తగ్గిన కేసీఆర్ ప్రసంగాలు..! ఇబ్బందులకు గురిచేసిన మతపరమైన వ్యాఖ్యలు..!!
ముందస్తు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసిన చాలామంది ఓటర్లు ముఖ్యంగా హిందువులు బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. మైనార్టీలు కూడా ఈ సారి కొంతమేర కమలం వైపు మరికొందరు హస్తం వైపు ఓట్లేసినట్లు సమాచారం. ఊహించని ఎదురుదెబ్బకు ప్రభుత్వం అవలంభిస్తున్న ఏక పక్ష నిర్ణయాలే కారణమంటూ సగటు ఓటర్లు చర్చించుకుంటున్నారు. ఇది కేవలం నిజామాబాద్ కే పరిమితంగాకుండా.. సికింద్రాబాద్ , ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి, చేవెళ్లకూ పాకినట్టు సమాచారం. ఫలితంగా.. కాంగ్రెస్, భీజేపీలో తలో రెండు సీట్లు గెలుచుకుంటారని సమాచారం. ఈ లెక్కన. గులాబీ నేతలకు పదహారు బదులు.. పుష్కరం అంటే 12 సీట్లు గ్యారంటీ అంటూ లెక్కలు కడుతున్నారు.
16రాకపోతే ఏంటి కర్తవ్యం..! సమాలోచలను జరుపుతున్న గులాబీ శ్రేణులు..!!
కొడుకును బలమైన నాయకుడిగా తీర్చిదిద్దాలని భావించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కల కలగానే ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పిల్లనిచ్చినందుకు అల్లుడి ప్రసంగాన్ని లోక్ సభలో చూసి ముచ్చట తీర్చుకోవాలని భావించిన మరో మంత్రి మల్లారెడ్డి ఆశలు కూడా ఊగిసలాటలో ఉన్నాయట. ఇటువంటి క్లిష్టమైన సమయంలో కేసీఆర్ 16 సీట్లు గెలవకుంటే.. తాను గొర్రెలు పంపిణీ చేసిన జనం కూడా గొర్రెల్లా మారారంటారో.. లేకపోతే.. ఆంధ్రోళ్లు చేసిన ద్రోహంగా చిత్రీకరిస్తారో.. తూచ్.. ఇదంతా ఈవీఎం మెషీన్ల వాడకం వల్లనేనంటూ తప్పంతా ఎన్నికల సంఘం మీద నెట్టేస్తారో చూడాలి మరీ.