మిస్టర్ మోడీ! చంద్రబాబులా భయపడను, తేల్చుకుందామా: కేసీఆర్ సవాల్, సంచలన వ్యాఖ్యలు
Recommended Video
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు.
నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని చెప్పారని, ప్రధానమంత్రి హోదాలో ఉండి అబద్దాలు చెబుతారా అని మండిపడ్డారు. అంతకుముందు మోడీ మాట్లాడుతూ.. నిజామాబాద్ను లండన్గా మారుస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ కనీస సదుపాయాలు లేవని, విద్యుత్ సమస్య ఉందని చెప్పారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
నిజామాబాద్ వస్తే.. అక్కడే తేల్చుకుందామా
దీనిపై కేసీఆర్ ఆగ్రహోద్రుడయ్యారు. నరేంద్ర మోడీకి ఆయన సవాల్ విసిరారు. నేరుగా నేను ఇక్కడి నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్ వస్తానని, అక్కడే తేల్చుకుందామా అని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని చెప్పడం అబద్దమన్నారు. బాధ్యతాయుతమైన ప్రధానిగా ఉంటే అబద్దాలు చెప్పడమే రాజకీయం అని, రాజకీయం ఇలా దరిద్రంగా మారిందని వాపోయారు.
మోడీ సాబ్ సమాధానం చెప్పాలి, అందుకే హిందీ ఇంగ్లీష్లలో చెప్పా
మోడీకి నేను సవాల్ చేస్తున్నానంటూ కేసీఆర్ హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాట్లాడారు. ఆయనకు అర్థం కావాలనే నేను ఇలా మాట్లాడానని చెప్పారు. నిజామాబాద్ వస్తానని, ఇద్దరం సభ పెట్టి మాట్లాడుతామని, కరెంట్ గురించి ప్రజలను అడుగుదామా అని ప్రస్నించారు. తనపై చేసిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్పాలి మోడీ సాబ్ అన్నారు. ఇంత అబద్దం సరికాదన్నారు.
మిస్టర్ నరేంద్ర మోడీ.. ఇబ్బంది లేదు
మిస్టర్ నరేంద్ర మోడీ.. కరెంట్ ఇబ్బంది లేదు, అబద్దాలు చెప్పవద్దు, ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అని కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబులా తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. తాను పదవి కాలం మధ్యలోనే ముగించానని మోడీ చెప్పారని, తనకు పని లేక ముగించానా అన్నారు. ప్రాజెక్టులు, అభివృద్ధి అడ్డుకుంటున్నారని చేశానని చెప్పారు.
భయపడేందుకు నేను చంద్రబాబును కాదు
ప్రధాని నరేంద్ర మోడీకి తాను భయపడేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. భయపడటానికి తాను ఏమీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో మత గజ్జి ప్రభుత్వం ఉందని, నరేంద్ర మోడీ ఇంత తెలివితక్కువ ప్రధానమంత్రి అనుకోలేదని చెప్పారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాము మజ్లిస్ పార్టీతో కలిసి పని చేస్తున్నామని స్పష్టం చేశారు. తమవి కల్తీలేని పార్టీలు అన్నారు. పక్కా ప్రాంతీయ పార్టీలని, తెలంగాణ కోసం పని చేస్తున్నామన్నారు.
చంద్రబాబుతో కలిసి కుట్రలు చేశారు
2014లో మనం గెలిచాక ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు కుట్రలు చేశారని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 2014లో తెరాస అధికారంలోకి రాగానే చంద్రబాబు మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేశారని చెప్పారు. ఆ విషయాన్ని తనకు అసదుద్దీన్ ఓవైసీ ఫోన్ చేసి చెప్పారని చెప్పారు.
చంద్రబాబు ఎందుకివ్వలేదు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ హయాంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఎందుకివ్వలేదని కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాదును ప్రపంచపటంలో పెట్టానని చంద్రబాబు చెప్పుకుంటారని విమర్శలు గుప్పించారు. కొత్త రాష్ట్రంలో ఎంతో కష్టపడి పని చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో కరెంట్ కష్టాలు ఎందుకు తీర్చలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది 20 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పారు. ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నామని, రెండు తరాలకు ఉపయోగపడేలా ఉంటుందన్నారు.
చంద్రబాబు అడ్డుకుంటున్నారు
మీ మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు రానివ్వమని కానీ మాకు ఓటేయాలని, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొడతా కానీ మాకు ఓటేయాలని చంద్రబాబు అంటున్నారని, మనకు ఏమైనా పౌరుషం లేదా అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు. ఈ ఎన్నికలు ఆషామాషా ఎన్నికలు కాదన్నారు. చంద్రబాబు పెత్తనం మనకు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఆయనను తీసుకు వస్తోందన్నారు. వారిద్దరుకు ఓటుతో రాజకీయంగా బుద్ది చెప్పాలన్నారు. పాలమూరుకు నీరు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.