నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా, ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్
Recommended Video
హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ముందు తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ వచ్చిందంటే, వారికి పదవులు వచ్చాయంటే అందుకు గులాబీ జెండా పోరాటం వల్లేనని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం అన్నారు. కొంపల్లిలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడారు.
పార్టీ ప్రారంభించిన సమయంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని చెప్పారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ సాధించామన్నారు. ఎన్నో అనుమానాలు, అపోహలు పటాపంచలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఎవరు అవాకులు, చవాకులు పేలినా, గాలి ఆరోపణలు చేసినా మనం నిజాయితీగా పని చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొందరు శాపనార్థాలు పెట్టారన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత తమదే అన్నారు. పార్టీ ప్రారంభించినప్పుడు అనేక అనుమానాలు ఎదురయ్యాయని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళణ మనం నాలుగేళ్లలో పూర్తి చేశామన్నారు.
ప్రపంచంలో, భారత దేశంలో లేని విధంగా రైతాంగానికి రూ.8వేలు ఇచ్చే విధంగా పథకం తీసుకు వస్తున్నామన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్గా ఉందన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులకు ఎక్కువ జీతాలు ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. రాబడిలో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో ఉందన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని, ఆయన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా ఉండటానికి గులాబీ జెండానే కారణం అన్నారు. టీఆర్ఎస్ పోరాడకుంటే ఆయన ఈ పదవి దక్కించుకునే వాడు కాదన్నారు. పీసీసీకి ముందు తెలంగాణ ఉందంటే అది మా కష్టం ఫలితం అన్నారు. అబద్దం చెప్పవద్దని, అలా చెప్పినా అతికినట్లుగా ఉండాలన్నారు. నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీ నేతల సంచులు మోసేవాళ్లన్నారు. ఇప్పుడు తెలంగాణ చీఫ్ అయ్యారన్నారు.
నూటా యాభై గదులతో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టారని ఉత్తమ్ అంటున్నారని, ఈ రోజు సాయంత్రం ప్లీనరీ అయిపోయిన తర్వాత రాత్రి ఏడు గంటలకు అక్కడే ఉంటానని, మీడియాతో కలిసి వచ్చి అన్ని గదులు ఉన్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. విమర్శలు చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. ప్రగతి భవన్లో 16 రూములు చూపినా సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. లేదంటే ఆయన ముక్కు నేలకు రాయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రగతి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
తెలంగాణ ఇసుక పాలసీ దేశంలోనే గొప్పగా ఉందని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారని, కర్నాటక కాంగ్రెస్ నేత రేవణ్ణ కూడా తమ పథకాలపై ప్రశంసలు కురిపించారని కేసీఆర్ చెప్పారు. కర్నాటక, మహారాష్ట్ర నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారని తెలిపారు. టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ అని, కాంగ్రెస్ దశాబ్దాలుగా తెలంగాణను వేధించిన పార్టీ అన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ 250కి పైగా కేసులు పెట్టిందన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారన్నారు.