వివాదం: గవర్నర్కు సీఎంలు ఇలా.., అసెంబ్లీపై కోడెలకు జగన్ ప్రశ్న
హైదరాబాద్: ఉమ్మడి ఆస్తుల విభజన పైన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సహకరిస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు గవర్నర్ నరసింహన్కు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
సోమవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు ఇరువురు సీఎంలు హాజరైన విషయం తెలిసిందే. ఇరువురు సీఎంలు గవర్నర్తో ఏడు నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. తేనీటి విందుకు ముందు ఈ ఏకాంత భేటీ జరిగింది.
ఈ సమావేశంలో గవర్నర్ కార్యదర్శి పాల్గొన్నారు. హైకోర్టు విభజన అంశం కేంద్రమే తేల్చాల్సి ఉందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండినందు వల్ల నీటి విడుదలలో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. తేనీటి విందు తర్వాత చంద్రబాబు వెళ్లారు. గవర్నర్తో కేసీఆర్ కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇద్దరు చంద్రుల పున్నమి
ఈ రోజు (సోమవారం) ఇద్దరు చంద్రుల పున్నమి అని గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లను ఉద్దేశించి కామెంట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం గవర్నర్ రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. దీనికి చంద్రబాబు, కేసీఆర్, వైయస్ జగన్ తదితరులు హాజరయ్యారు.
జగన్ తొలిసారి
గవర్నర్ మాట్లాడుతూ.. ఈ రోజు వాతావరణం బాగుందని, ఇద్దరు చంద్రులు తేనీటి విందుకు రావడం నిండు పున్నమిని చూసినట్లుగా ఉందని, అందరూ ఆనందిస్తారన్నారు. జగన్ రాజ్ భవన్లో జరిగిన తేనీటి విందులో తొలిసారిగా పాల్గొన్నారు.
రెండేళ్ల తర్వాత బాబు, కేసీఆర్ తొలిసారి ఒకే వేదికపై
చంద్రబాబు, కేసీఆర్, జగన్లు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం.. 2014 ఆగస్ట్ 15 తర్వాత గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు ఇద్దరు సీఎంలు హాజరుకావడం కూడా ఇదే ప్రథమం. సోమవారం సాయంత్రం 5.20 గంటలకు కేసీఆర్ రాజ్భవన్కు వచ్చి గవర్నర్ను కలిశారు. ఐదు నిముషాల తర్వాత చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరూ 15 నిముషాల పాటు గవర్నర్ సమక్షంలో సమావేశమయ్యారు.
కృష్ణా పుష్కరాల గురించి
ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రులిద్దరూ నరసింహన్కు వివరించారు. కృష్ణాలో నీరు ఉండడం వల్ల పుష్కరాలకు కళ వచ్చిందన్నారు. ఇరు రాష్ట్రాల్లో వర్షాలు, ప్రాజెక్టుల నీటిమట్టాల గురించి చర్చించారని తెలుస్తోంది. పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రులిద్దరినీ గవర్నర్ అభినందించారు.
కరచాలనాలు
అనంతరం వేదిక పైకి వచ్చారు. జాతీయ గీతాలాపన అనంతరం గవర్నర్, ఆయన సతీమణి విమలా నరసింహన్ సీఎంలతో కలిసి ఆహూతులను పలకరించారు. గవర్నర్, చంద్రబాబు, కేసీఆర్ విందుకు హాజరైన వారికి నమస్కరిస్తూ, కరచాలనాలు చేశారు.
అభివాదం, కరచాలనం
జగన్ ఇద్దరు సీఎంలు, గవర్నర్తో కరచాలనం చేశారు. గవర్నర్ ఆహూతులను పలకరించేందుకు వెళ్లగా కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి ముఖ్యమంత్రుల వద్దకు వచ్చి కూర్చున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఏపీ, తెలంగాణల మండలి ఛైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, సభాపతులు కోడెల శివప్రసాద్రావు, మధుసూదనాచారి, ఎంపీ కేశవ రావు, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి హాజరయ్యారు.
ఎట్ హోంకు పలువురు హాజరు
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కోడెలను అడిగిన జగన్
ఏపీ శాసనసభా సమావేశాలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారని జగన్ స్పీకర్ కోడెల శివప్రసాద రావును అడిగారు. సమావేశాలను కచ్చితంగా ఏపీలోనే నిర్వహిస్తామన్న కోడెల.. తేదీలు, వేదికను ముఖ్యమంత్రి, ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందన్నారు.
నిబంధనల మేరకే
శాసనసభలో సభ్యులకు మాట్లాడే సమయాల కేటాయింపు గురించి జగన్ ప్రశ్నించారు. తాను నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నానని, రికార్డులు కూడా పరిశీలించవచ్చని స్పీకర్ కోడెల చెప్పారు. కాసేపటికి బయలుదేరిన జగన్ తొలుత కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. తర్వాత చంద్రబాబుకు అభివాదం చేసి కదిలారు.
జగన్కు చక్రపాణి సూచన
చక్రపాణిని కలిసి వెళ్తుండగా, చంద్రబాబుకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు.. నేను కలిపిస్తానురా అంటూ ఆయనను బాబు వద్దకు తీసుకెళ్లారు. చంద్రబాబు చేతుల్లో కాఫీ కప్పు ఉండడంతో జగన్ మరోసారి అభివాదం చేసి వెళ్లిపోయారు. తర్వాత చంద్రబాబు కేసీఆర్తో కరచాలనం చేసి, తనకు మరో కార్యక్రమం ఉందని గవర్నర్కు చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేసీఆర్తో సుజనా చౌదరి కాసేపు మాట్లాడారు.
గవర్నర్తో కేసీఆర్
విందు అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్తో దాదాపు 15 నిముషాలపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పుష్కరాలకు హాజరుకావాలని, గొందిమల్లలోని జోగులాంబ ఘాట్ను సందర్శించాలని కోరారు. 19న తాను తెలంగాణలో పుష్కరాలకు వస్తానని నరసింహన్ తెలిపారు.