విశాఖపట్నంకు కేసీఆర్, రోడ్డంతా గులాబీ ఫ్లెక్సీలు, తోరణాలు: థర్డ్ ఫ్రంట్ కోసం మూడ్రోజులు బిజీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీల ఏకీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల కోసం ఆయన ప్రాంతీయ పార్టీలతో చర్చించనున్నారు. ఇందుకు మూడు రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు.
కేసీఆర్ మూడు రోజుల పర్యటన ఆదివారం ఉదయం ప్రారంభమైంది. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరారు. విశాఖలోని శారదాపీఠంలో కేసీఆర్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకుంటుంది. ఇక్కడ రాజశ్యామల ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. కేసీఆర్ విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పీఠంలో ఏర్పాట్లు చేశారు. చినముషిడివాడ కూడలి నుంచి శారదాపీఠంవరకు భద్రతా ఏర్పాట్లను విశాఖ డీసీపీ 2 శనివారం పరిశీలించారు.
నవీన్ పట్నాయక్తో సాయంత్రం భేటీ
అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు కేసీఆర్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో సాయంత్రం ఆరు గంటల సమయంలో భేటీ అవుతారు. సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమవుతారు. అదే రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తోనూ భేటీ కానున్నారు. వీరితో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారు.
సోమవారం మమతా బెనర్జీతో భేటీ
కేసీఆర్ ఆదివారం రాత్రి భువనేశ్వర్లో బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయాలను సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కోల్కతా వెళ్తారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మమతా బెనర్జీని కలుస్తారు.
మోడీ సహా పలువురితో భేటీ
అనంతరం కాళీమాత దేవాలయాన్ని దర్శించుకుంటారు. అదేరోజు రాత్రి ఢిల్లీ వెళ్తారు. 26న సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీని కలుస్తారు. తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్తో భేటీ అవుతారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, మాయావతిలను కేసీఆర్ కలవనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.
అనంతరం తెలంగాణకు
మరోవైపు, ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులతో భేటీ అనంతరం తెలంగాణకు తిరిగి వస్తారు. కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన కోసం తెరాస ఓ విమానాన్ని నెలరోజుల పాటు బుక్ చేసింది. కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశముంది.
కేసీఆర్కు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు
కేసీఆర్ విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. గతంలో కేసీఆర్ ఏపీకి వెళ్లినప్పుడు అక్కడ భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఆదివారం విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏపీలోని కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్నారు. విశాఖ విమానాశ్రం నుంచి శారదాపీఠం వెళ్లే రోడ్డు మార్గం వరకు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.
స్వాగతం అంటూ తోరణం
పలు మెయిన్ రోడ్లలోను వీటిని ఏర్పాటు చేశారు. 'ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు స్వాగతం.. సుస్వాగతం' అంటూ సాదరంగా ఆహ్వానించే తోరణాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్కు ఏపీలోని అభిమానులు ఉన్నారు. అందుకే తెరాస ఏపీకి కూడా రావాలని చాలామంది కోరుకుంటున్నారు.