కేసీఆర్ మోసం చేశారు.. రైతులను పరామర్శించే తీరిక లేదు కానీ!..: రేవంత్
కొత్తగూడెం: రెండో విడుత ప్రజాచైతన్య యాత్రలో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సోమవారం ఇల్లందు, కొత్తగూడెంలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి కేసీఆర్కు తీరిక దొరకట్లేదని, కానీ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడతో మంతనాలకు మాత్రం తీరిక దొరుకుతుందని ఎద్దేవా చేశారు.
మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో తెలంగాణలో పోడు రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారని రేవంత్ విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ మోసాలను గుర్తించండి: ఉత్తమ్ కుమార్
సీఎం కేసీఆర్ బీసీలకు చేస్తున్న అన్యాయాలను తెలంగాణ బీసీ ప్రజానీకం గుర్తించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో ఇప్పుడు బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు సబ్ప్లాన్ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్ పెట్టాలన్న తమ డిమాండును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
గత బడ్జెట్ సమయంలో వచ్చే బడ్జెట్లో సబ్ప్లాన్ ప్రవేశపెడుతామని చెప్పి.. తీరా ఈ బడ్జెట్ లోనూ అన్యాయమే చేశారని ఆరోపించారు. బీసీల్లోని ఏ,బీ,సీ,డీ కేటగిరీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచరు అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.