చైనా నుంచి కెసిఆర్ తిరుగు పయనం, తెరపైకి విజయశాంతి... రాజ్యం మారినా హింస ఆగలేదు
మెదక్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన చైనా పర్యటన ముగిసింది. చివరగా హాంకాంగ్లో పర్యటించిన ఆయన అక్కడి నుంచి తన బృందంతో కలిసి తిరుగు పయనమయ్యారు.
బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉందని సమాచారం.
రాజ్యం మారింది.. కానీ రాజ్యహింస ఆగలేదు: విజయశాంతి
మావోయిస్టు అజెండానే తమ అజెండా అని కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కానీ అధికారం చేపట్టాక బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతోందని మెదక్ మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి బుధవారం మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం మారిందే తప్ప రాజ్యహింస ఆగలేదని కెసిఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
టిఆర్ఎస్లోకి కిష్టారెడ్డి కుటుంబ సభ్యులు వెళ్లరు: సునితా లక్ష్మా రెడ్డి
నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాలని తాము కోరుకుంటున్నామని మాజీ మంత్రి సునితా లక్ష్మా రెడ్డి అన్నారు. కిష్టారెడ్డి కుటుంబం నుంచి ఎవరు కూడా టిఆర్ఎస్లోకి వెళ్లరని చెప్పారు. అనివార్యమైతే ఉప ఎన్నికను ఎదుర్కొంటామన్నారు.
కేసీఆర్ ప్రజలను మోసం చేశారు: మందకృష్ణ
నక్సల్స్ అజెండా అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ వచ్చాక ఎన్కౌంటర్ పేరుతో ప్రజలకు బహుమతి ఇచ్చారన్నారు. వరంగల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగానే యువత మావోయిస్టుల్లో చేరుతున్నారన్నారు. కేసీఆర్కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు.
ఎన్కౌంటర్ మృతదేహాలకు కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్ట్మార్టం: కోర్టు
వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో చనిపోయిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫోరెన్సిక్ నిపుణులతో పోస్ట్ మార్టం నిర్వహించాలని వరంగల్ జిల్లా కోర్టు ఆదేశించింది. జిల్లాలోని తాడ్వాయి మండలం నార్లాపూర్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తంగెళ్ల శృతి, మణికంటి విద్యాసాగర్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.