కేసీఆర్కు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ ఈమెయిల్ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపారు.
ముంబైలో అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు టైమ్స్ గ్రూపు ఎండీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ముఖ్యమంత్రి సమ్మతించారు.
ఈ అవార్డు తనకు వ్యక్తిగతంగా వచ్చినట్లు భావించడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి లభించిన గుర్తింపుగా స్వీకరిస్తున్నాని సీఎం ఈ సందర్భంగా టైమ్స్ గ్రూపునకు ఈమెయిల్ ద్వారా బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం గడిచిన నాలుగేళ్లుగా సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున, ఈ ఏడాది మొదటి ఐదేళ్లలో 21.96 శాతం ఆదాయాభివృద్ది సాధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం మంచి ఫలితం ఇచ్చిందని, దీని ద్వారా ఇప్పటికే 7000 పరిశ్రమలు అనుమతులు పొందాయని సీఎం వివరించారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు, పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా, ఎవరూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరిశ్రమల అనుమతులు వస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ది ఇలాంటి అవార్డులు రావడానికి కారణం అవుతున్నదని వెల్లడించారు. భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేసీఆర్ వివరించారు.