కాంగ్రెస్లో కేసీఆర్ 'సన్నాసి' చిచ్చు: జానా వర్సెస్ భట్టి, వీహెచ్ ఫైర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పొడసూపాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల నేపథ్యంలో ఇరువురు ముఖ్య కాంగ్రెస్ నేతల మధ్య శుక్రవారం నాడు పరోక్ష మాటల యుద్ధం నడిచింది. కేసీఆర్ వ్యాఖ్యల పైన విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
కేసీఆర్ వ్యాఖ్యల పైన మల్లు భట్టి విక్రమార్క గురువారం మాట్లాడుతూ.. సన్నాసి అన్నారు. దీనిపై జానా రెడ్డి శుక్రవారం స్పందించారు. ఎదుటి వారికి నీతులు చెప్పే మనం అలా వ్యవహరించడం సరికాదని భట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు. నేతలు హుందాగా మాట్లాడాలన్నారు.
దీనికి వెంటనే మల్లు భట్టి ఘాటుగా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ సన్నాసులకు చెప్పానన్న కేసీఆర్ వ్యాఖ్యల పైన తాను మాట్లాడానని ఆయన చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన, హావభావాలు కేసీఆర్లో కనిపించడం లేదని భట్టి చెప్పారు.
కేసీఆర్ భాష మార్చుకో: వీహెచ్
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ సన్నాసి భాష మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు చెప్పారు. మరోసారి అలాంటి భాష మాట్లాడితే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్నారు.