చంద్రబాబు తలనొప్పి తెచ్చుకున్నారు, కెటిఆర్పై పుకార్లే: కెసిఆర్
చంద్రబాబు మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించి తలనొప్పులు తెచ్చుకున్నారని, తాను ఆ పని చేయబోనని కెసిఆర్ చెప్పారు. కెటిఆర్పైనా ఆయన స్పందించారు.
హైదరాబాద్: మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకేతాలు ఇచ్చారు. బుధవారం మంత్రివర్గ సమావేశం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి ప్రశ్నించారు. దానికి ఆయన 'మీరు చెప్తే చేస్తా' అని అన్నారు.
అయినా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేయాలని ప్రశ్నిస్తూ ఏపీలో చంద్రబాబునాయుడు అలా చేసే తలనొప్పులు తెచ్చుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు కేటీఆర్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తారా అని ప్రశ్నించినప్పుడు అవన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు.
ఆ రకంగా పార్టీ ప్లీనరీ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తెరదించారు.. ఇందిరాపార్క్ నుంచి ధర్నా చౌక్ను తరలించడంలో తప్పులేదని ముఖ్యమంత్రి సమర్దించుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడంలో తప్పు లేదని, అయితే అది ప్రజలకు అసౌకర్యంగా ఉండవద్దని ఆయన అన్నారు.
గతంలో ధర్నా చౌక్ సచివాలయానికి ఎదురుగా లుంబినీ పార్క్ వద్ద ఉండేదని, దానిని ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్దకు మార్చారని గుర్తు చేశారు. నగర జనాభా పెరుతుండటం వల్ల కాలక్రమేణ ధర్నాలు, ఆందోళనలకు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేరే చోటికి మార్చమని తానే పోలీసులకు చెప్పానని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, ఆందోళన వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలుపై ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయనున్నట్టు కోర్టుకు పోలీసులు తెలిపారని ముఖ్యమంత్రి వివరించారు.