మారనున్న రూపు రేఖలు.. వ్యవసాయంలో ఇకనుంచి అదే పద్దతి.. ఇదీ కేసీఆర్ యాక్షన్ ప్లాన్..
ప్రభుత్వం సూచించిన రకం పంటలే రైతులు సాగు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆ పంటలకే రైతుబంధు, మద్దతు ధర వర్తిస్తుందన్నారు. అంతే తప్ప, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, మార్కెట్కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరని అన్నారు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దని, డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని సూచించారు.
రైతులు ఏ పంటలు వేస్తే లాభపడుతారో ప్రభుత్వమే చెబుతుందని.. అందుకు మద్దతు ధర ఇస్తామని.. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు వేరే ఆలోచనలు ఎందుకని ప్రశ్నించారు. రైతుల ఆలోచనలో మార్పు రావాలని చెప్పారు. రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై మంగళవారం(మే 12) ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు.
జల జగడం: జగన్పై కేసీఆర్ ఫైర్.. జీవో 203పై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు.. ఏపీ ఘాటు స్పందన.. అసలేంటిది?
ఎవరు ఏ రకం.. ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి..
రైతులకు లాభం చేయాలనే ఉద్దేశంతో నియంత్రిత పద్థతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఈ వర్షాకాలంలో వరిపంటతో ఈ విధానం మొదలుకావాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన విధానం ప్రకారం.. 'రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలి. ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలి. 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలి. మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండిస్తారు. పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగుకు ప్రోత్సహిస్తారు. ఏ ప్రాంతంలో ఎవరు ఏ రకం, ఎంత విస్తీర్ణంలో పండించాలో త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుంది.' అని వివరించారు.
సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ
రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే పంటల సాగు నిర్ణయిస్తుండటంతో.. విత్తనాలు కూడా సర్కార్ నిర్ణయించిన పంటలకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైతే విత్తన చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై కేసీఆర్ దీనిపై చర్చించనున్నారు. ఇక నకిలీ విత్తనాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రేతలను గుర్తించి, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం బుధవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యటించాలని చెప్పారు.
గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాని కారణమదే..
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం.. అందరూ ఒకేరకమైన పంటలు పండించడమేనని కేసీఆర్ అన్నారు. కాబట్టే మార్కెట్ డిమాండ్కు తగ్గట్లు పంటలు పండించాలని చెబుతున్నామన్నారు. ఈ మాట తాను ఇవాళ చెప్పడంలేదని.. 20 ఏళ్ల క్రితం రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి చెబుతున్నానని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, గత వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు గురించి అనేకసార్లు ప్రతిపాదనలు చేశానని చెప్పారు. ఇంతకు మించిన గత్యంతరం లేదని.. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలని స్పష్టం చేశారు.
వ్యవసాయ శాఖ పునర్వ్యవస్థీకరణ
వ్యవసాయ విధానంలో మార్పులకు అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించింది. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయ పరచాలని కోరింది. రాష్ట్రంలో గోదాముల నిర్వహణ సులభంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో రైస్మిల్లుల సామర్థ్యం పెంచేందుకు త్వరలో వాటి యజమానుల సంఘం ప్రతినిధులతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఈ వానకాలం నుంచే షురూ...
ఈ వర్ష కాలం నుంచే నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానం అమలులోకి వస్తుందని కేసీఆర్ చెప్పారు. దీనిపై చర్చించేందుకు, తగు సూచనలు చేసేందుకు ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఏడీఏ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారి ఇందులో పాల్గొంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఏఈఓలు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు, గ్రామాల రైతు బంధు సమితిల అధ్యక్షులు పాల్గొని సలహాలు,సూచనలు చేస్తారు.