సవతి తల్లి కలలోకి వస్తుందన్న ప్రత్యూష: నేనున్నానని కెసిఆర్ భరోసా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దంపతులు శనివారం సాయంత్రం హైదరాబాదులోని సరూర్నగర్ గల గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి ప్రత్యూషను పరామర్శించారు. కెసిఆర్, ఆయన సతీమణి శోభ ప్రత్యూషను పలకరించారు. ప్రత్యూష నుదుటిపై శోభ చేయి వేసి భరోసా ఇచ్చారు. కెసిఆర్, శోభ వెంట వారి కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.
తన సవతి తల్లి కలలోకి వస్తుందని ప్రత్యూష కెసిఆర్ దంపతులతో చెప్పింది. దాంతో తాను ఉన్నానని, భయం అక్కర్లేదని కెసిఆర్ ఆమెకు భరోసా ఇచ్చారు. తన ఇంటికి వస్తే కూతురిలా ఆహ్వానిస్తానని చెప్పారు. ఎంతు వరకు చదువుకోవాలనుకుంటే అంత వరకు చదివిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.
కన్నతండ్రి, సవతితల్లి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై గ్లోబల్ ఆస్పత్రిలో ప్రత్యూష చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత పది రోజులుగా చికిత్స పొందుతున్న ప్రత్యూష క్రమంగా కోలుకుంటోంది. ప్రత్యూష భవిష్యత్తుపై కెసిఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రత్యూష ఆలనా పాలనను కెసిఆర్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఆమె చదువుకు అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వతా ప్రత్యూషను వారం రోజుల పాటు కెసిఆర్ తన నివాసంలో ఉంచుకుంటారు. సవతి తల్లిని, తండ్రిని జైలునుంచి బయటకు రానివ్వవద్దని ప్రత్యూష సిఎంను కోరింది. జీవితంలో కష్టాలు వస్తుంటాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కెసిఆర్ ఆమెకు చెప్పారు.
నీకు ఇల్లు కట్టిస్తానని, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయిస్తానని కెసిఆర్ ప్రత్యూషకు కెసిఆర్ హామీ ఇచ్చారు. చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని, చదువుకుని పైకి రావాలని ఆయన ప్రత్యూషకు చెప్పారు. కొత్త జీవితం ప్రారంభించాలని, నీలా ఎవరైనా ఇబ్బందుల్లో పడితే వారిని ఆదుకునే పరిస్థితిలో నువ్వు ఉండాలని ఆయన ప్రత్యూషకు చెప్పారు.
ప్రత్యూష ఆరోగ్యం, భద్రత చూసుకోవాలని ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లను ఆదేశిచారు. పూర్తిగా కోలుకునే వరకు ప్రత్యూషను ఆస్పత్రిలోనే ఉంచాలని ఆయన చెప్పారు.
గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిని కెసిఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవితంలో ఆమె ఏం కావాలనుకుంటోంది, ఆమె లక్ష్యం ఏమిటి అనేది కెసిఆర్ తెలుసుకున్నారు. ఆమె చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది.