కేసీఆర్ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనా..! కమలం దూకుడుకి గులాబీ తలవంచినట్టేనా..??
హైదరాబాద్: తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. లోక్ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహాన్ని భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపి బలపడిందని, అదికార పార్టీకి రోజులు దగ్గరపడ్డట్టేనని బీజేపి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం చంద్రశేఖర్ రావు రోజులు లెక్కపెట్టుకోవాల్సిన అవసరం ఉందని, చాపకింద నీరులా బీజేపి రాష్ట్రమంతా విస్తరిస్తోందని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ చెప్పుకొస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు కూడా తనదైన శైలిలో గులాబీ పార్టీ పై విరుచుకు పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందా అనే అనుమానం కలుగుతోందని, ప్రభుత్వం అవినీతి మయంగా మారిందని అన్నారు. తహశీల్దార్ లావణ్య కేసే ఇందుకు పెద్ద ఉదాహరణ అని బీజేపి అభివర్ణిస్తోంది. అనేక శాఖలపై ఆరోపణలు వచ్చినా, విచారణ ఎందుకు చేయడం లేదని బీజేపి సూటిగా ప్రశ్నిస్తోంది.
టీఆర్ఎస్ పై విమర్శలకు పదును పెంచిన బీజేపి..! గులాబీ కి ప్రత్యామ్నాయం మేమే అంటున్న కమలం..!!
టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలతో తమకు సంబంధం లేకపోయినప్పటికి, బీజేపిని విమర్శింస్తుంటేవ మాత్రం చూస్తూ ఊరుకోమని బీజేపి నేతలు గులాబీ నేతలను హెచ్చరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కి అసలు ఓ విధానం, ఓ సిద్దాంతం అంటూ ఉందా అని బీజేపి నేతలు నిలదీస్తున్నారు. నలుగురి కోసమే చంద్రశేఖర్ రావు పార్టీ పెట్టారని, చంద్రశేఖర్ రావు,కేటీఆర్ కు తప్ప మరో నేతకు అక్కడ స్థానం లేకుండా పోయిందని బీజేపి చెప్పుకొస్తోంది. ఈ ప్రభుత్వంలో పట్టపగలే ఆఘాయిత్యాలు, దోపిడీలు యధేఛ్చగా జరిగిపోతున్నాయని, ఏవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది ఈ ప్రభుత్వ పనితీరని ఎద్దేవా చేస్తున్నారు కమలం నేతలు. బీజేపిని కాపీ కొడుతూ టిఆర్ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్ చేస్తోందని ఘాటుగా విమర్శించారు కాషాయ నేతలు.
టీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల భయం..! సత్తా చాటుతామంటున్న లక్ష్మణ్..!!
టిఆర్ఎస్ లో కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేతలకు, బంగారు తెలంగాణ బ్యాచ్ కు పడట్లేదని బీజేపి విశ్లేషిస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యే అయిన సోమారపు సత్యనారాయణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి లు బీజేపిలో చేరారు. అక్కడ గౌరవం లేక మా పార్టీ పై నమ్మకం తో చేరుతున్నారు. ఈ చేరికలు అంతంకాదు ఆరంభం మాత్రమేనని బీజేపి చెప్పుకొస్తోంది. 16 రాష్ట్రాల్లో బీజేపి పాలనను చూసి పార్టీ లోకి వస్తున్నారని, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక లో కూడా ఎమ్మెల్యేలు తమ పార్టీ లో చేరుతున్నారని, బీజేపీ వికాసం సూర్యోదయం లాంటిదని, ఒకరు ఆపితే ఆగదని బీజేపీ చెప్పుకొస్తోంది. బీజేపి బలం పెరిగింది కాబట్టే ఇతర పార్టీల నేతలు పార్టీ లో చేరుతున్నారని, పార్టీ లో చేరేవారంతా బీజేపి విధానాలు అనుసరించాల్సిందేనని చెప్పుకొస్తున్నారు బీజేపి నేతలు.
ఆగమేఘాలపై మునిసిపల్ ఎన్నికలకు రెడీ ఐన టీఆర్ఎస్..! అన్ని మునిసిపాలిటీల్లో పోటీ చేస్తామంటున్న కాషాయం..!!
రాష్ట్రంలో తాము నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో చంద్రశేఖర్ రావు కు బీజేపీ జ్వరం పట్టుకుందని, చాపకింద నీరులా బీజేపీ విస్తరిస్తున్న విషయాన్ని ఆయన గమనించారని అన్నారు. అందుకే మునిసిపల్ ఎన్నికలకు నాలుగు నెలల గడువు కావాలని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన ప్రభుత్వం, ఉన్నఫళంగా ఒక్క నెలలో జరిపించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. అయినా మునిసిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, అన్ని మునిసిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఫేస్బుక్ లైవ్లో, మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ చేయలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. హైదరాబాద్లో మెట్రోరైలు పనులను పూర్తిచేయలేని కేటీఆర్, బుల్లెట్ రైలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
టీఆర్ఎస్కు ఇక చుక్కలు చూపిస్తాం..! అదికారం మాదే అంటున్న బీజేపి..!!
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఆలయాల భూములకు రక్షణ అని, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం సాధ్యమని తేల్చిచెప్పారు. నయీం అక్రమాస్తులపై విచారణను ఎందుకు అర్ధంతరంగా నిలిపివేశారని ప్రశ్నించారు. అక్రమ సంపాదనతో తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయని, ఎంపీ సీట్లను 100 కోట్ల రూపాయల చొప్పున అమ్ముకున్నట్లు టీఆర్ఎస్ నేతలే ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శిగా బి.ఎల్.సంతోష్ జీని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భూపాలపల్లి, ములుగు, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెందిన పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, డాక్టర్లు, న్యాయవాదులు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు.