కేసీఆర్ ముందస్తుకే ఓటేశారెందుకంటే..?: అంతా అనుకున్నట్లు జరిగితే రికార్డే!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. భారీ విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు సరికొత్త వ్యూహంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ రద్దు.. జస్ట్ 2 నిమిషాల్లో: కేసీఆర్ సంచలన నిర్ణయం, ఇదీ విషయం!
వాస్తవానికి ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గు చూపారు. దీంతో మరో రెండు మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడింది.
ముందస్తే సరైన నిర్ణయం?
అయితే, కేసీఆర్ ముందస్తు నిర్ణయం సరైందా? కాదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి కూడా పలు కారణాలు లేకపోలేదు. ఎన్నికలకు సమయం ఎక్కువగా ఉంటే కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలు పుంజుకునే అవకాశం ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ముందస్తే సరైన నిర్ణయంగా భావించినట్లు తెలుస్తోంది.
సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. కళ్యాణ లక్ష్మీ, రైతులకు ఆర్థికసాయం, బీమా, గొర్రెల పంపిణీ నుంచి తాజాగా కంటి వెలుగు పథకం వరకు పదుల సంఖ్యలో పథకాలను అమలు చేస్తోంది. జాతీయ స్థాయిలోనూ వీటి అమలుని పలు రాష్ట్రాలు ఆసక్తిగా గమనించాయి. ప్రత్యేకించి డబుల్ బెడ్ రూం పథకం తెలంగాణలోనే కొనసాగుతుండటం గమనార్హం. వీటితో పాటు ప్రతి ఇంటికి నీరు అందించే మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం పథకం జాతీయస్థాయిలో ఇంజినీరింగ్ అద్భుతంగా మారనుంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటంతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. సానుకూల వాతావరణంతో పాటు తెలంగాణ ఏర్పడిన అనంతరం ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా నిలిచింది.
హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి.. ఏపీ ఓటర్లూ..
హైదరాబాద్పై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లక్షలాది కుటుంబాలు హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డాయి. విభజనకు ముందులా కాకుండా తెలంగాణలో ఉన్న అందరూ తెలంగాణ బిడ్డలేనంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది టీఆర్ఎస్. ప్రస్తుతం శాంతి భద్రతల పరిస్థితి నగరంలో గతంలో ఎన్నడూలేని రీతిలో మెరుగ్గా ఉందనే చెప్పాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం మంచి ఫలితాలిస్తుండటంతో పరిశ్రమలు, పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. మజ్లిస్, బీజేపీ కూడా నగరంలో కొంత బలంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో జెండా ఎగురవేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా..
కాగా, తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే, కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో కొంత సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ.. లోపాలను చూపిస్తూ కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలు విస్తృత ప్రచారం చేస్తే పరిస్థితి మారే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది.
కేసీఆర్కు అధికారం నిలుపుకోవడం అంతకష్టం కాకపోయినా...
తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కేసీఆర్ సరికొత్త వ్యూహాలు అమలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధిని చేసి చూపిస్తామని ఓట్లు అడిగే అవకాశం ఉంది. మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం కేసీఆర్కు అంత కష్టమైన పని కాకపోయినప్పటికీ.. కాంగ్రెస్ తోపాటు విపక్షాలు పుంచుకుంటే మాత్రం పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. నవంబర్ లేదా డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ముందస్తు ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే మాత్రం కేసీఆర్ రికార్డు సృష్టించినట్లు అవుతుంది. ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ అధికార పార్టీ కూడా మళ్లీ అధికారంలోకి రాకపోవడం గమనార్హం.