జాతీయ పార్టీపై తేల్చేసిన సీఎం కేసీఆర్ : టీఆర్ఎస్ భవిష్యత్ పైనా క్లారిటీ..!!
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారబోతోంది. తెలంగాణ లక్ష్య సాధన పూర్తి కావటంతో..ఇప్పుడు జాతీయ స్థాయిలో కొత్త లక్ష్యంతో జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. కొంత కాలంగా జరుగుతున్న జాతీయ పార్టీ ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. జాతీయ పార్టీ పైన తన కార్యాచరణ తేల్చి చెప్పారు. తన భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేసారు. పార్టీ కార్యాలయంలో ఎంపీలు..ఎమ్మెల్యేలు..33 జిల్లాల అధ్యక్షులతో కేసీఆర్ సమావేశమయ్యారు.
5వ తేదీ మధ్నాహ్నం 1.19 గంటలకు
ఈ నెల 5వ తేదీన దేశం కోసం ఒక కీలక నిర్ణయం తీసుకోతున్నట్లుగా ప్రకటించారు. 5వ తేదీ నుంచి పార్టీకి ఎంపీలు - ఎమ్మెల్యేలతో పాటుగా 283 మంది ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారుస్తూ..అధ్యక్షుడిగా కేసీఆర్ ను ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఆ తరువాత నిర్ణయించిన ముహూర్తం మేరకు విజయ దశమి నాడు మధ్నాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తొలి సంతకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు రాజకీయంగా మద్దతుగా నిలిచిన పార్టీల నేతలను సీఎం ఆహ్వానించారు. అఖిలేష్, కుమార స్వామి, తేజస్వీ యాదవ్ తో పాటుగా ఇతర పార్టీల నేతలు వస్తున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ నే జాతీయ పార్టీగా
జాతీయ పార్టీగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే సాంకేతికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారిస్తే ఇబ్బందులు ఉండవనే అంచనాకు వచ్చారు. 5వ తేదీన పార్టీ ప్రకటన తరువాత 6వ తేదీన పార్టీ నేతలు తమ పార్టీ జాతీయ పార్టీగా మార్పు పైన కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్మానం కాపీ, లేఖ ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చటం ద్వారా ఏమైనా సమస్యలు వచ్చినా అధిగమించవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. కారు గుర్తు తమకే ఉంటుందనే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ పేరు మారినా, కారు గుర్తు మాత్రం కొనసాగనుంది. దేశంలో ఇక బీజేపీకి..కేసీఆర్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
జాతీయ పార్టీ అభ్యర్దిగా మునుగోడు బరిలో
పార్టీ నిర్మాణం పూర్తయిన తరువాత డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన రోజునే ఢిల్లీ కేంద్రంగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ నిర్ణయించారు. ఆ సభలో మద్దతుగా నిలుస్తున్న పార్టీల అధినేతలు హాజరు కానున్నట్లు సమాచారం. ఇక..ఈ రోజు జరిగిన సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక అంశం పైనా కేసీఆర్ స్పందించారు. మునుగోడులో అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయని..టీఆర్ఎస్ అభ్యర్ది గెలుపు ఖాయమని చెప్పారు. ఇదే సమయంలో మునుగోడు ఎన్నిక సమయానికి జాతీయ పార్టీ అభ్యర్ధిగా టీఆర్ఎస్ నేత బరిలో ఉంటారంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో..మూడు జాతీయ పార్టీల అభ్యర్ధులు బరిలో నిలవనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..టీఆర్ఎస్ ఇక జాతీయ పార్టీగా మారటానికి రంగా సిద్దం అయింది.