అన్ని వివరాలతో చర్చిద్దాం!: కేసీఆర్, ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, ఏం జరుగుతోంది?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే కేసీఆర్ కేవలం ఓటుకు నోటు పైనే సమీక్ష నిర్వహించలేదు. అన్ని కేసులపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు.
చదవండి: తెరపైకి ఓటుకు నోటు కేసు!: అధికారులతో కేసీఆర్ భేటీ
పలు పెండింగ్ కేసులపై ఆయన పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో చర్చించారు. ఓటుకు నోటుతో పాటు ఐఎన్జీ భారత్ స్కాం, హౌసింగ్ స్కాం, మౌలిక వసతుల సంస్థలోని స్కాంలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అసలు ఈ కేసుల పురోగతి ఏమిటనే విషయం ఆయన ఆరా తీశారు.
ఈ కేసులన్నింటిపై వివరాలు తెలుసుకున్న కేసీఆర్
కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయి కీలక కేసులపై సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ హయాంలో ఉన్న కేసులపై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. భూముల కేసుల పైన కూడా చర్చ జరిగింది. ఐఎంజీ, రహేజా, ఎమ్మార్ భూముల కేసుల పురోగతిపై కేసీఆర్ ఆరా తీశారు. పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్నారు.
మరో రెండు రోజుల పాటు కేసుల సమీక్ష
ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రోజుల పాటు కేసులను పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు వెల్లడించారు. ఆయా కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు చెప్పారని తెలుస్తోంది.
పూర్తి వివరాలతో రేపు, ఎల్లుండి చర్చిద్దాం
రేపు (మంగళవారం), ఎల్లుండి (బుధవారం) కేసులను సమీక్షిస్తానని, ఈ కేసులలో తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని కేసీఆర్ ఆరా తీశారు. అనంతరం పూర్తి వివరాలు, నివేదికతో రేపు మళ్లీ చర్చిద్దామని అధికారులతో చెప్పారు.
కేసులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం
కేసీఆర్ తొలుత డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచంద్ర రావులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మధ్యలో ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ను పిలిచారని తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు అధికారులు ఉండగా న్యాయ నిపుణులను పిలిచారని తెలుస్తోంది. ఓటుకు నోటు సహా ఇతర కేసుల విషయమై ఎవరెవరు కేసులు వేశారు, వీటిని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి, ఈ కేసులు ఏఏ కోర్టుల్లో ఉన్నాయి.. తదితర వివరాలను ఆరా తీశారు. కేసులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారని తెలుస్తోంది.
కదిపేసిన ఓటుకు నోటు
ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తెలంగాణ శాసనసభ నుంచి మండలి కోసం 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలను తమవైపు తిప్పుకొనేందుకు నాడు తెలంగాణ టీడీపీ నేతలు రూ.50లక్షలు ఇవ్వజూపారనే ఆరోపణలు దుమారం రేపాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపులు, విజువల్స్ను బయట పెట్టడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై విచారణ జరుగుతోంది.
గవర్నర్తో భేటీ ఐన మరుసటి రోజు సమీక్ష
కాగా, కేసీఆర్ అంతకుముందు రోజు (ఆదివారం) గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఆయనతోను సుమారు గంటన్నర సేపు భేటీ అయ్యారు. గవర్నర్తో భేటీ అయిన మరుసటి రోజు కేసీఆర్ కీలకమైన కేసులపై సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.