కేసీఆర్కు భారీ షాక్: ఐదేళ్లు ఎన్నికలు వద్దు.. హైకోర్టులో పిటిషన్, ఎప్పుడు రద్దు చేయాలంటే?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. మరో తొమ్మిది నెలలు గడువు ఉన్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేయడంపై రాపోలు భాస్కర్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీని రద్దు చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
కొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా: రాష్ట్రపతి పాలనకు డిమాండ్?
అయిదేళ్లు పూర్తయ్యేవరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారించనుంది. కేసీఆర్ గురువారం తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది కేసీఆర్కు గట్టి షాక్ అని చెప్పవచ్చు.
అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఉన్నప్పటికీ
తెలంగాణ రాష్ట్రాన్ని అయిదేళ్ల పాటు పరిపాలించాలని ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ ఇంకా 9 నెలలు ఉండగానే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడానికి అధికారం ఉన్నప్పటికీ, సరైన కారణాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దారుణం అని ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అందుకే ఐదేళ్లు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలి
రాష్ట్రాలలో అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించడానికి కారణం కావడం, రాష్ట్రంలో తిరిగి పరిపాలన ఆగిపోవుటకు, రాష్ట్ర అభివృద్ధికి ఆగిపోవుటకు, రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవుటకు కారణం అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించరాదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని ఆయన తెలిపారు.
అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలంటే?
ప్రకృతి విపత్తులు, రాజకీయ అస్థిరత, సరైన సంఖ్యాబలం లేనప్పుడు, శాంతిభద్రతలు లోపించినప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాతీర్పు కోరుతారని విపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలో అవేం లేవని, శాసనసభ రద్దు అప్రజాస్వామికమని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ ఎత్తుగడ అన్నారు. అసెంబ్లీని రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. దీంతో కేసీఆర్ శకం అంతమైందన్నారు. ప్రజలు తీర్పు ఇవ్వకముందే ఓటమిని అతనే ప్రకటించుకున్నాడని, కేసీఆర్ హిట్లర్ శకం పూర్తయిందన్నారు.
అసెంబ్లీ రద్దుపై విపక్షాల విమర్శలు
కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంపై విపక్షాలు కూడా విమర్శలు కురిపిస్తున్నాయి. తాము ముందస్తుకు సిద్ధమేనని చెబుతున్నాయి. అదే సమయంలో రద్దుకు సరైన కారణాలు లేవని ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ పాలన హిట్లర్ పాలనను తలపించిందని వ్యాఖ్యానించారు. తాము ఎన్నికలకు భయపడటం లేదని, కానీ కారణాలు లేకుండా అసెంబ్లీ రద్దు, ఎన్నికలు వస్తాయని చెప్పడంపై తాము అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి మాటలపై ఈసీ సందేహాలు నివృత్తి చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.