2019లో ప్రజాతీర్పు కాంగ్రెస్ పక్షమే; కేసీఆర్ను తరిమికొట్టండి: ఉత్తమ్ కుమార్
భద్రాద్రి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లపై తెలంగాణ అసెంబ్లీ విధించిన బహిష్కరణ వేటును హైకోర్టును రద్దు చేయడంతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ.. కేసీఆర్, మధుసూదనాచారి పదవుల్లో కొనసాగే నైతిక హక్కు కోల్పోయారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఆయన హామి ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్రలో భాగంగా.. మణుగూరులో నిర్వహించిన సభలో ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమావేశంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 1000 కోట్ల కమీషన్లకు కక్కుర్తి పడి కాలుష్యకాసారమైన బీటీపీఎస్ను మణుగూరులో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
2019లో ప్రజాతీర్పు కాంగ్రెస్ పక్షమే: సర్వే
తమ పార్టీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ విధించిన బహిష్కరణ వేటును హైకోర్టు ఎత్తివేయడంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. 2019ఎన్నికల్లో ప్రజాతీర్పు కూడా కాంగ్రెస్ పక్షమే అవుతుందన్నారు.
మరో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్కు చెంప పెట్టు అని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఉండేందుకు ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయించారని ఆయన ఆరోపించారు.