ఆంధ్రావాళ్లూ! తెలంగాణవాళ్లమని చెప్పుకోండి, మీకు చంద్రబాబే శని, సిగ్గు బుద్ధి రాలేదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రా ప్రాంతవాసులు తాము తెలంగాణ వాళ్లమని చెప్పుకోవాలని, ఇక్కడి ఆంధ్రావాళ్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడే పెద్ద శని అని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు.
పవన్ కళ్యాణ్! మా బతుకు మేం బతుకుతాం: వీ హనుమంత రావు, కేసీఆర్కు జైపాల్ సవాల్
ఈ నాలుగేళ్లలో ఆంధ్రా వాళ్ల విషయంలో ఏమైనా తేడా వచ్చిందా అని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్లంటే మాకు వ్యతిరేకత ఉంటే నాలుగేళ్లలో ఎన్ని గొడవలు జరిగేవని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉడుములా వచ్చి ఇక్కడ గొడవ పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన పెట్టిన క్లబ్బులు, వేట కొడవళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయన్నారు.
70 ఏళ్ల క్రితం వచ్చినా ఆంధ్రావాళ్లేనా?
70 ఏళ్ల క్రితం తెలంగాణకు వచ్చిన వాళ్లు కూడా ఇంకా ఆంధ్రావాళ్లేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రులకు పట్టిన శని చంద్రబాబు అన్నారు. సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరమని, వంద సీట్లు దాటడం తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో ఆంధ్రా, తెలంగాణ అనే బేధం లేదని చెప్పారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు వచ్చి రాయి వేసే ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్లో నిత్యం శాంతిభద్రతల సమస్య అని, అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని కేసీఆర్ చెప్పారు. పొద్దున లేస్తే ఇదే సమస్య అన్నారు. ఆంధ్రా వారిపై తమకు వ్యతిరేకన భావన ఉంటే ఏదైనా జరిగేది కదా అని, కానీ ఏం జరగలేదని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు వెళ్లాక ఈ నాలుగున్నరేళ్లలో హైదరాబాద్ సహా తెలంగాణ ప్రశాంతంగా ఉందని చెప్పారు. కత్తులు లేవు, హత్యలు లేవు, మతకల్లోహాలు లేవన్నారు. ప్రశాంతంగా బతుకుతుంటే చంద్రబాబు వచ్చి రాయి వేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. డిసెంబర్ తర్వాత గెడ్డం గీసుకొనే వారు ఎవరో తేలుతుందన్నారు.
జీహెచ్ఎంసీలో ఆంధ్రావాళ్లు బుద్ధి చెప్పారు, రాహుల్కు భయపడతానా?
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అంటే నేను భయపడతానా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్లు తెచ్చిందే తానను, ఇక తాను ఎందుకు భయపడతానని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు చేతులు కాల్చుకున్నారని విమర్శించారు. ఇదే చంద్రబాబు, ఇదే కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్పారని, కానీ అదే ఆంధ్రావాళ్లు వారికి బుద్ధి చెప్పారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే మహాకూటమికి దారుణమైన ఫలితాలు ఉంటాయని చెప్పారు.
ఆంధ్రాప్రాంతం వారు హైదరాబాదీలుగా గర్వపడాలి
తెలంగాణలో తమకు ఎలాంటి పొత్తు అక్కరలేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. చంద్రబాబు వంటి వాడితో పొత్తా అన్నారు. నాలుగేళ్లుగా ఇక్కడ చంద్రబాబు వాసన లేదన్నారు. నాలుగైదు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని, ఖమ్మం జిల్లాలో 10 స్థానాలు గెలుస్తామని చెప్పారు. ఆంధ్రా ప్రాంతం వారు హైదరాబాదీలుగా గర్వపడాలన్నారు.
ఏపీలో చంద్రబాబు ఏం చేయలేదు, ఇన్నాళ్లు స్కాంలు ఆగేవా?
కుంభకోణాలు జరిగితే దాగుతుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. హౌసింగ్ పేరుతో నాటి ఎమ్మెల్యేలు దోచుకున్నారని, మా ఎమ్మెల్యేలు అలా తిన్నారా అని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు చెప్పింది ఒక్కటీ చేయలేదన్నారు. మేనిఫెస్టోను అమలు చేయలేదన్నారు. అక్కడే చేయకుండా ఇక్కడకు వచ్చి ఏమి చేస్తావని ప్రశ్నించారు. తెలంగాణ రైతు కాలుమీద కాలు వేసుకొని కూర్చునే రోజు వస్తుందన్నారు.
ఇంకా సిగ్గు, బుద్ధి రాలేదు
ఈ నాలుగున్నరేళ్లుగా ఇక్కడ చంద్రబాబు వాసన లేదని కేసీఆర్ అన్నారు. మీ చిల్లర రాజకీయాల కోసం ఇక్కడకు వస్తావా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇక్కడ రాజ్యాలు ఏలుతారా, తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్లా అని ప్రశ్నించారు. లేని మెజార్టీ కోసం ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయావని, ఇంకా సిగ్గు, బుద్ది రాలేదని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మతకల్లోహాలు, గొడవలు ఉండేవన్నారు. ఇప్పుడు ఏ గొడవలు లేవన్నారు. అభద్రత లేదన్నారు. తెలంగాణ వాళ్లకు గౌరవం ఇవ్వాలన్నారు. మాకు ఆంధ్రోళ్లపై బేధం లేదని, మీరు (చంద్రబాబు) వచ్చి కొర్రాయి పెడితే ఎలా అన్నారు.
ఏ కాంగ్రెస్ నాయకుడిని వదిలిపెట్టను, జైపాల్ రెడ్డిపై ఆగ్రహం
ప్రశాంతంగా బతుకుతుంటే చంద్రబాబు వచ్చి రాయి వేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తెలంగాణలో అడుగుపెడితే భస్మమే అన్నారు. చంద్రబాబు దుర్మార్గాలన్నీ ఇక్కడి నుంచి పోయాయన్నారు. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి వయస్సు అయిపోయిందని, ఎందుకు అనవసరంగా పంచాయతీ అని ఎద్దేవా చేశారు. తాము కుంభకోణాలు చేస్తే ఇప్పటి వరకు ఆగేవాళ్లా అన్నారు. అవినీతి జరిగి ఉంటే ఇంత గ్రోత్ రేట్ రాదన్నారు. ఈసారి అవినీతికి పాల్పడిన ఏ కాంగ్రెస్ నాయకుడిని వదిలిపెట్టనని చెప్పారు. అభ్యర్థులను తాము మార్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.