పెట్టుబడులు: దీదీ గడ్డపై సీఎం కేసీఆర్కు ప్రశంసలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానంపై కోల్కత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజుల్లా చెల్లూర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తోన్న విధానం సులభతరంగా ఉందని కొనియాడారు.
బ్యాక్ డిపాజిటర్లకు చెల్లించేందుకు గాను విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిమిషన్ ఇవ్వాలంటూ పోంజీ సంస్ధ దాఖలు చేసిన పిటీషన్ విచారణ సమయంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజుల్లా చెల్లూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సరైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? అని ప్రశ్నించారు.
కేరళ, కర్ణాటకల నుంచి కూడా ఎవరూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారో అలాంటి వారికి ప్రభుత్వం స్వయంగా ఎస్కార్ట్ను ఏర్పాటు చేసి సరైన సమయంలో అనుమతులు మంజూరయ్యేలా చూస్తున్నారు.
ఎలాంటి కారణం లేకుండా పెట్టుబడిదారులకు అన్ని మౌళిక సదుపాయాలాను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఇటీవలే కోల్కత్తాకు చెందిన ఐటీసీ సంస్ధ తెలంగాణ రాష్ట్రంలో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
రాబోయే ఐదు సంవత్సరాల్లో వేసుకున్న ప్రణాళికల్లో భాగంగా ఐటీసీ సంస్ధ దేశ వ్యాప్తంగా రూ. 25,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో కోల్కత్తా రూ. 3,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా, తెలంగాణలో రూ. 8000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.