వాస్తేనా?: 29 రోజుల తర్వాత సచివాలయంలో కాలు పెట్టిన కెసిఆర్
హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సచివాలయంలో కాలు పెట్టారు.బుధవారం సచివాలయానికి వచ్చిన ఆయన దాదాపు గంటన్నరసేపు గడిపి వెళ్లిపోయారు. గత నెల 23వ తేదీ తర్వాత ఆయన సచివాలయంపై కూడా చూడలేదు.
సరిగ్గా 29 రోజుల విరామం అనంతరం సచివాలయానికి వచ్చివెళ్లారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు సీఎం జయలలిత సుదీర్ఘకాలం సచివాలయానికి దూరంగా ఉండటంపై అక్కడ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా 29 రోజులు సచివాలయానికి దూరంగా ఉండటంపై కూడా చర్చ ప్రారంభమైంది.
బుధవారం కూడా ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకే ఆయన సచివాలయానికి వచ్చారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన అనంతరం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఏవీ చూడకుండానే వెళ్లిపోయారు. ఆయన అధికారిక కార్యక్రమాలన్నీ క్యాంపు కార్యాలయం నుంచే నిర్వహిస్తున్నారు.
సచివాలయాన్ని వేరే చోటికి మార్చాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నారు. ఛాతీ ఆస్పత్రిని తరలించి అక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావించారు. ప్రస్తుత సచివాలయం వాస్తు సరిగా లేదనే అభిప్రాయంతో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. దానికారణంగానే ఆయన సచివాలయానికి దూరంగా ఉంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.