మేడిగడ్డ, జగిత్యాలలో పంప్ హౌస్ పనులను పరిశీలించిన కేసీఆర్..!!
జగిత్యాల/హైదరాబాద్ : తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావు ప్రాజెక్టుల బాట పట్టారు. తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్ పంప్హౌస్ పనులను సీఎం చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. మోటర్ల బిగింపు పనుల పురోగతిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
రెండు రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని మంత్రి ప్రశాంత్రెడ్డికి ఆదేశాలు జారీ చేసారు. జులై 15వ తేదీ లోగా పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రారంభోత్సవానికి వస్తానని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి, ఎంపీ సంతోష్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, సీఎంవో స్మితా సబర్వాల్, మాజీ ఎంపీ వినోద్, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు మంగళవారం మేడిగడ్డ చేరుకుని వ్యూ పాయింట్ నుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. పెండింగ్ పనుల పూర్తికి అధికారులకు తగు సూచనలు,సలహాలు ఇచ్చారు. బ్యారేజి పనులు దాదాపు 90శాతం వరకు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజి పనులను రెండు వారాల వ్యవధిలో సీఎం పరిశీలించడం ఇది రెండో సారి.
ఈ వర్షా కాలంలో కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సీఎంతో పాటు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఉన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం సీఎం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట విమానాశ్రయానికి, అటు తర్వాత నేరుగా ప్రగతిభవన్కు చేరుకుంటారు.