బిజెపి టార్గెట్ తో కెసిఆర్ ఇలా, వ్యూహాత్మక మిత్రులమే, ఆశీర్వదించండి
కేంద్రప్రభుత్వానికి వ్యూహాత్మక మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దండయాత్ర చేయడం బాధ కలిగించిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.
హైదరాబాద్: కేంద్రప్రభుత్వానికి వ్యూహాత్మక మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దండయాత్ర చేయడం బాధ కలిగించిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.అమిత్ షా తెలంగాణకు కించపరిచేలా మాట్లాడారని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం నాడు రాజ్ భవన్ లో సుమారు గంటకు పైగా సమావేశమయ్యారు.మూడు రోజుల పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటించి అవాస్తవాలను ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. అమిత్ షా మాట్లాడిన మాటలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంపై ఉద్దేశ్యపూర్వకంగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దాడి చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం నుండి ఏ మేరకు రాష్ట్రానికి నిధులు వచ్చాయనే దానిపై కెసిఆర్ గవర్నర్ కు వివరించారు.
కేంద్రం నుండి రావాల్సిన నిధులను విడుదల చేసే విషయంలో కూడ కేంద్రం తాత్సారం చేస్తోందని ఆయన గవర్నర్ దృష్టికి తెచ్చారు. బిజెపికి అన్ని విధాలుగా సహకరిస్తున్నా , ఆ పార్టీ తెలంగాణపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేస్తుందన్నారు.
బిజెపికి వ్యూహాత్మక మిత్రపక్షం
నోట్ల రద్దును సమర్థించాం, నీతి ఆయోగ్ ను స్వాగతించాం. కేంద్ర పథకాలన్నీ అమలు చేస్తున్నాం. అయినా మాపై దాడిచేయడమేమిటీ? అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. నోట్ల రద్దుపై బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడ మౌనం పాటించారని, అందరికంటే ముందే తాను నోట్ల రద్దుకు మద్దతుగా మాట్లాడానని కెసిఆర్ గవర్నర్ నరసింహాన్ కు గుర్తుచేశారు.ప్రజలు ఇబ్బందులు పడినా దేశానికి మేలు జరుగుతోందని సమర్ధించినట్టు కెసిఆర్ చెప్పారు.కేంద్రానికి వ్యూహాత్మక మిత్రపక్షంగా ఉన్నప్పటికీ జాతీయ అధ్యక్షుడు దండయాత్ర చేయడం బాధ కల్గించిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి
తెలంగాణపై దండయాత్ర చేసి...అబాసుపాలు చేసేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నించారని కెసిఆర్ అన్ననారు. తెలంగాణ నుండి రూ.50,013 కోట్లు కేంద్రానికి ఆదాయం లభిస్తే, మూడేళ్ళలో కేంద్రం ఇచ్చింది రూ.24,561 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు.కేంద్ర అమ్మకపు పన్నులతో పాటు, కంపా నిధుల కింద రాష్ట్రానికి రూ.11 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.బీఆర్ జీఎప్ కింద మూడు వాయిదాలు ఇస్తే తెలంగాణకు రెండు వాయిదాలే ఇచ్చారని గుర్తుచేశారు.పార్లమెంట్ సమావేశాల్లో , బయట కేంద్రానికి మద్దతిస్తోంటే దండయాత్ర చేయడం ఏమిటంటూ విచారం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రశంసలు పొందిన విషయాన్ని కెసిఆర్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడ తమ ప్రభుత్వతీరును ప్రశంసించారని ఆయన గుర్తుచేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా రూ. లక్ష కోట్లు ఇచ్చామంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశానికి ఆదాయవనరులుగా ఆరేడు రాష్ట్రాలున్నాయని, వాటిలో తెలంగాణ కూడ ఒకటని చెప్పారు.ప్రధాన పన్నుల ద్వారా 17.82 శాతం ఆధఆయ వృద్దిరేటు నమోదైదంటూ గణాంకాలను గవర్నర్ కు వివరించారు.
ఆ బిల్లులను ఆశీర్వదించండి
ముస్లింలకు 12 శాతం, 10 శాతం రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును ఆశీర్వదించాలని గవర్నర్ ను సీఎం కోరారు. తెలంగాణ 90 శాతం ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఉన్న రాష్ట్రం. ఏపీతో విడిపోయాక జనాభా శాతం పెరిగింది. పెరుగుదలకు అనుగుణంగా ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. ముస్లింల వెనుకబాటుతనంపై ప్రధానమాడీ కూడ ఏకీభవించారని ఆయన ప్రస్తావించారు. బిల్లును పంపిస్తే రాష్ట్రపతి ఆమోదం ఇప్పించి షెడ్యూల్ 9 లో పెట్టడానికి అంగీకరించారు. బిల్లును ఢిల్లీకి పంపించి ఆశీర్వాదం అందించండని ఆయన కోరారు.