కేసీఆర్, నరేంద్ర మోడీలపై మండిపడిన లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నిప్పులు చెరిగారు. దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను ఆ పదవి నుంచి తొలగించారన్నారు.
దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ను శాసనసభ నుంచి బహిష్కరించారన్నారు. తెలంగాణలో దళితులకు పాలించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్వేచ్ఛను హరించే యత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందన్నారు.
బీజేపీ ప్రభుత్వం దళితులకు, ఆదివాసీలకు వెన్నుపోటు పొడుస్తోందన్నారు. దళితుల, ఆదివాసీల హక్కులను కాలరాస్తోందన్నారు. ఆ తర్వాత మైనార్టీల వద్దకు వస్తుందని, అనంతరం పేదలు, బ్యాక్ వర్డ్ క్లాస్ వద్దకు వస్తుందని హెచ్చరించారు.నరేంద్ర మోడీని పదవి నుంచి తొలగించాలని, బీజేపీ ప్రభుత్వాన్ని దించేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.