నా హృదయంలో ప్రత్యేక స్థానం: కేసీఆర్ తీరుపై చిదంబరం అసహనం, 'సర్వేలన్నీ కూటమికే'
హైదరాబాద్: తన హృదయంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంటుందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం బుధవారం అన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటనను తాను మరిచిపోలేనని చెప్పారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పారు.
వెరీ ఇంట్రెస్టింగ్: తెలంగాణలో రాహుల్-చంద్రబాబు కలిసి ప్రచారం, రెండు సభల్లో ప్లాన్
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మహాకూటమిని బలపరచాలని ప్రజలను కోరారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని చిదంబరం అన్నారు. బీజేపీ పాలనపై కేసీఆర్ మౌనంగా ఉంటున్నారంటే దాని అర్థం, వారిని సమర్థిస్తున్నట్లేనని చెప్పారు.
తెరాస ఎన్నో హామీలు ఇచ్చింది కానీ
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని తాను భావించానని చిదంబరం చెప్పారు. కానీ ఆయన హామీలు నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వషన్లు, 22 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి మండలంలో పాఠశాల.. ఇలా టీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ దేనిని అమలు చేయలేదన్నారు. కేసీఆర్ నయా నవాబ్లా వ్యవహరిస్తున్నారని, అతను 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుష్బూ ఇదివరకే విమర్శించారు. మహిళలపై దారుణాలు కొత్త రాష్ట్రంలో పెరిగాయని ఆరోపించారు.
ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలి
డిసెంబర్ 7వ తేదీ ఎన్నికలు ఉన్నాయని, అప్పటి వరకు ప్రతి కార్యకర్త, నేత సైనికుడిలా పోరాడాలని, ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరుగా చెప్పారు. రాబోయే పదిహేను రోజులు చాలా కీలకమని తెలిపారు. అధికార పార్టీ అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకోవాలన్నారు. దోచుకొని, దాచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు తెరాస అనైతిక కార్యకలాపాలను పోలీసులు, ఎన్నికల అధికారులకు తెలియజేస్తూ అడ్డుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రజాకూటమి అధికారంలోకి వచ్చాక కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
అన్ని సర్వేలు మహాకూటమిదే అధికారమని చెబుతున్నాయి
ప్రయివేటు, పార్టీ సర్వేలు ప్రజాకూటమికి అనుకూలంగా ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. డిసెంబర్ 12న కచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అదికారంలోకి వస్తుందని చెప్పారు. కేసీఆర్ తన ఫాంహౌస్కే పరిమితం అయ్యారని చెప్పారు. ఎన్నికల తర్వాత కేటీఆర్ అమెరికాకు పయనం కాక తప్పదని ఎద్దేవా చేసారు.
సోనియా సభను విజయవంతం చేయండి
23వ తేదీన మేడ్చల్లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీలు ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్న సభ చారిత్రకమైనదని, దానిని విజయవంతం చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావాలన్నారు.