జమిలి ఎన్నికలకు కేసీఆర్ ఒకే, లా కమిషన్కు లేఖ: 'మోడీకి సపోర్ట్ కాదు'
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జమిలి ఎన్నికలకు సిద్ధమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు లా కమిషన్కు కేసీఆర్ లేఖ రాశారు. టీఆర్ఎస్ నేతలు లా కమిషన్ను ఆదివారం కలిశారు.
వన్ నేషన్ వన్ ఎన్నికలకు (జమిలి ఎన్నికలు) తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, లోకసభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ రాసిన లేఖను టీఆర్ఎస్ నేతలు లా కమిషన్కు ఇచ్చారు. జమిలి ఎన్నికలపై లా కమిషన్ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుంటోంది.
కేసీఆర్ లేఖ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని గుర్తు చేశారు. తమ నిర్ణయం నరేంద్ర మోడీ ప్రభుత్వానికో, మరొకరికో అనుకూలం కాదని తేల్చి చెప్పారు. లా కమిషన్ ఎప్పటి నుంచో దీనిపై అభిప్రాయం సేకరిస్తోందన్నారు.
2019 నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తమ పార్టీ అనుకూలంగా ఉందన్నారు. జమిలి అంటే అందరూ ముందస్తు ఎన్నికలు అని అనుకుంటున్నారన్నారు. కానీ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమన్నారు. ఏకకాల ఎన్నికలపై చర్చ ఇప్పటికిప్పుడే మొదలు కాలేదని, 1986 నుంచీ న్యాయ కమిషన్ ఇదే విషయమై చర్చిస్తోందన్నారు. మోడీ తెచ్చిన కొత్త విధానమని కొందరు పొరపాటు పడుతున్నారని, అంతకు ముందు నుంచే ఈ అంశంపై చర్చ జరుగుతోందన్నారు.
ఈ విధానంతో ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల పాలన సుగమంగా సాగుతుందని, పూర్తికాలం పాటు ప్రభుత్వాలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ అనుకూలమని చెప్పడంతో పాటు, కలిగే ప్రయోజనాలనూ కమిషన్కు వివరించామన్నారు.
2019 నుంచి మేమూ సిద్ధం
జమిలి ఎన్నికలకు తాము సిద్ధమేనని సమాజ్వాదీ పార్టీ న్యాయ కమిషన్కు తెలిపింది. పార్టీ తరఫున ఆ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 2019 నుంచి అయితే ఎన్నికలకు తాము సిద్ధమని, లోకసభతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలరు. అయితే, 2019 తర్వాత అంటే మాత్రం ఒప్పుకునేది లేదన్నారు. ఈ విధానం అమలుకు తగిన కసరత్తు జరగాలన్నారు.