దేవుడి మొక్కులపైనా ఇష్టం వచ్చినట్లేనా?: కేసీఆర్ ఫైర్, హైకోర్టుకు మర్రి
తాను తెలంగాణ ఉద్యమ సమయంలో దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులను తీరుస్తుంటే విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
మహబూబాబాద్: తాను తెలంగాణ ఉద్యమ సమయంలో దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులను తీరుస్తుంటే విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని వీరభద్రస్వామికి శుక్రవారం శివరాత్రి సందర్భంగా.. బంగారు మీసాలను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
శివుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున మొక్కు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కురవి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
దేవుడికి చెల్లించే మొక్కులపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 40ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని, ఆ పార్టీ నాయకులు ప్రగతి నిరోధకులని కేసీఆర్ విమర్శించారు.
అభివృద్ధి కోసం తాము కృషి చేస్తుంటే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని.. వారి తీరును శాసనసభలో ఎండగడతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, 64లక్షల సంచార జాతులకు రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. వరంగల్ జిల్లాలో రెండు పంటలు పండే విధంగా కృషి చేసి... ఉభయగోదావరి జిల్లాలకు దీలుగా సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ చెప్పారు.
అంతేగాక, నాయీ బ్రాహ్మణులకు 25-30వేల సెలూన్లు ఏర్పాటు చేస్తున్నామని, యాదవులకు రూ.4వేల కోట్లతో 88వేల గొర్రెలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. డోర్నకల్, మరిపెడ అభివృద్ధి కోసం రూ.కోటి చొప్పున... డోర్నకల్లోని 77 పంచాయతీలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రభుత్వ సొమ్ముతో శ్రీవారికి ఆభరణాలు చేయించారంటూ సీపీఎం నేత రాఘవులు, పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై విధంగా వారికి కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ మొక్కుపై హైకోర్టుకు మర్రి
సీఎం కేసీఆరు తిరుమల శ్రీవారికి మొక్కుగా ఆభరణాలు చెల్లించడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయం ఎక్కువగా ఉండే ఆలయాల నుంచి సేకరించే కామన్ గుడ్ ఫండ్ను శిథిలావస్థలో వున్న ఆలయాలు.. దూదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలకు ఉపయోగించాలన్నారు.
అంతేగానీ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల దేవస్థానానికి ఆ ఫండ్తో ఆభరణాలు చెల్లించడం చట్ట విరుద్ధమని అన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ను ప్రభుత్వం తరలించాలనుకోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మర్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.