ఎక్కువ ఊహించుకున్నావ్, సర్పంచ్ అయ్యావా: కోదండపై కేసీఆర్ డైరెక్ట్ అటాక్, ఉద్యమ క్రెడిట్ నాదే
సింగరేణి ఎన్నికల్లో కార్మికులు ఏకపక్షంగా తమకు ఓటు వేసి గెలిపించారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో కార్మికులు ఏకపక్షంగా తమకు ఓటు వేసి గెలిపించారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండపై మండిపడ్డారు. కోదండరాం విషపూరిత వ్యక్తి అన్నారు. అమరుల స్ఫూర్తి యాత్రలో శ్రీకాంత చారి తల్లిని కోదండరాం ఎందుకు పరామర్శించలేదని కేసీఆర్ నిలదీసారు.
కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకి అన్నారు. ఆయన రహస్యంగా సోనియా, దిగ్విజయ్ సింగ్లను కలిశారని చెప్పారు. మూడేళ్లలో కాంగ్రెస్ బంగారు తెలంగాణ అవుతుందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కోదండరాంకు రాజకీయ బీమార్ తప్ప మరేదీ లేదన్నారు. పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత సులభం కాదన్నారు. కోదండ బాధేంటో అర్థం కావట్లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో రాసిందే ఆయన అన్నారు.
కేసీఆర్కు దాసోజు శ్రవణ్ షాక్: సింగరేణిలో సత్యం తరహా భారీ స్కాం, ఇదీ లెక్క
కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే అంటారు
ప్రతిసారి కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని విపక్షాలు అంటుంటాయని కేసీఆర్ మండిపడ్డారు. సింగరేణిలో అన్ని పార్టీలు ఒక్కటైనా టిబిజికేఎస్ విజయం సాధించిందన్నారు. తమను గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు అన్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు తెరాసని గెలిపిస్తున్నారన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు.
వారసత్వ ఉద్యోగాల పొట్ట కొట్టింది వారే
వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేశామన్నారు. వారసత్వ ఉద్యోగాల పొట్ట కొట్టింది విపక్షాలే అన్నారు. కారుణ్య నియామకాలతో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సింగరేణిలో అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికలు, ఇప్పుడు సింగరేణి ఎన్నికల్లో.. ఇలా ప్రతిసారి తెరాసను ప్రజలు గెలిపిస్తున్నారని చెప్పారు. కాబట్టి దాదాపు ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇస్తున్నారని చెప్పారు. ఏ అజెండా ఎత్తుకోవాలో ప్రతిపక్షాలకు తెలియడం లేదన్నారు.
గవర్నర్ మెచ్చుకున్నారు
భూరికార్డుల పరిశీలనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని కేసీఆర్ మండిపడ్డారు. కానీ స్వయంగా గవర్నర్ పరిశీలించి మెచ్చుకున్నారని తెలిపారు. రైతులను సమన్వయం చేసేందుకే రైతు సమన్వయ కమిటీలు అన్నారు. ప్రాజెక్టులపై పదేపదే కోర్టులకు వెళ్లి స్టే తెస్తున్నారన్నారు.
ఇంకా బుద్ధి రావడం లేదు
ప్రజలు తిరస్కరిస్తున్నా ప్రతిపక్షాలకు బుద్ధి రావడం లేదన్నారు కేసీఆర్. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలను చూస్తుంటే జాలేస్తోందన్నారు. సింగరేణిలో ఇంతటి ఘన విజయం ఇప్పటి వరకు ఎవరికీ దక్కలేదన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు.
కోదండరాం ఎక్కువ ఊహించుకున్నాడు
కోదండరాం జీవితంలో సర్పంచ్ కాలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకున్నారని మండిపడ్డారు. కోదండరాం అనే వాడు టిఆర్ఎస్ వ్యతిరేకి అన్నారు. టిబిజికెఎస్కు ఓటేస్తే ఫలితం ఉండదని అంటారా అని నిలదీశారు. టిబిజికేఎస్ను ఓడించాలని కోదండ సింగరేణిలో చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన ఏమైనా జాతీయ నాయకుడా అని నిలదీశారు. ఎవరైనా సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని, అక్కసుతో మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. రోజుకు రూ.6 లక్షలు ఖర్చు పెట్టి కేసులు వేసే స్థోమత రైతులకు ఉందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ కేసులు వేస్తోందన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు.
నేను తయారు చేసిన వేలమంది కార్యకర్తల్లో కోదండ ఒకరు
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. నేను తయారు చేసిన వేలమంది కార్యకర్తల్లో కోదండ ఒకరు అన్నారు. తెరాస అధికారంలోకి రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. పనికిమాలిన సంఘాలతో ఇప్పుడు జేఏసీ నడుపుతున్నాడని ఎద్దేవా చేశారు. కొలువుల కొట్లాట ఎవరి కోసమని నిలదీశారు. కోదండకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే నేరుగా రావాలన్నారు. కావాలంటే టిక్కెట్ ఇస్తానని చెప్పానని కేసీఆర్ అన్నారు. కానీ దానికి జేఏసీ ముసుగు ఎందుకు అని నిలదీశారు. కోదండను ప్రజలు పట్టించుకోవద్దన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ దొర
టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను దొర అంటున్నారని, కానీ ఆయన ఉంటున్న సూర్యాపేట జిల్లా తాటిపాముల గ్రామంలో ఆయన నివసించే బంగ్లాను గడి అంటారని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఉత్తమ్ కుమారే అసలైన దొర అన్నారు. సామాజిక మాధ్యమాల్లోను సిఎం, మంత్రులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. చరిత్రలో అద్భుతమైన పనులకు తాము శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో కొన్ని చిల్లర గ్యాంగ్ విషపూరిత రాతలు రాస్తున్నారన్నారు.
ఉద్యమం టైంలో జేఏసీ క్రెడిట్ అంతా నాదే!
విపక్షాలు ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానాలని, నిర్మాణత్మక సూచనలు చేయాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అన్ని పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు ఐకాస ఏర్పాటు చేశామని, అన్ని కార్యక్రమాలను తెరాస ముందుండి నడిపించిందన్నారు. జేఏసీకి పేరు పెట్టిందే నేనని, కార్యక్రమాలను తాను సూచించానని చెప్పి, తద్వారా ఉద్యమం సమయంలో జేఏసీ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నారు. పదవులను గడ్డిపోచలా భావించి త్యాగం చేశామన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఉంటాయన్నారు. ఎవరు అడ్డుపడినా అభివృద్ధి కొనసాగిస్తామన్నారు.