తప్పుకునేది లేదు: సోనియా, ఇందిరా గాంధీలపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ ఉద్యమం సమయంలో ఆత్మహత్యలకు ఏఐసీసీ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమని సిఎం కేసీఆర్ శుక్రవారం అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఇందిరా గాంధీ అణిచివేశారని ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో ఆత్మహత్యలకు ఏఐసీసీ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమని సిఎం కేసీఆర్ శుక్రవారం అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఇందిరా గాంధీ అణిచివేశారని ఆరోపించారు.
నా వల్లే నువ్విలా, నేరుగా రా: కోదండపై కేసీఆర్ అటాక్, ఉద్యమం క్రెడిట్ నాదే
వారి హయాంలో అన్యాయం
నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ హయాంలలో అన్యాయం జరిగిందని చెప్పారు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. అప్పుడు మంత్రి మండలి నుంచి ఒక్క కాంగ్రెస్ నేత ఉద్యమంలో పాల్గొనలేదన్నారు.
జానా, ఉత్తమ్లు మంత్రి పదవులు పట్టుకొని వేలాడారు
తెలంగాణ ఇచ్చిన ఫలితాలు కనిపించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం విడ్డూరమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు తెలంగాణ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో పాలన ప్రశాంతంగా సాగుతోందన్నారు. తెలంగాణపై అప్పుడు కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంటే జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మంత్రి పదవులు పట్టుకొని వేలాడారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై స్టే తెచ్చింది దామోదర రాజనర్సింహ కాదా అన్నారు.
సోనియా గాంధీ కారణం కాదా
తెలంగాణలో వేలమంది బలిదానాలకు సోనియా కారణం కాదా అని నిలదీశారు. రాజకీయాల్లో అసహనం పనికి రాదన్నారు. తమ ప్రభుత్వంలో ఎన్కౌంటర్లు, మతఘర్షణలు లేవన్నారు. అవకాశం ఉండి, వనరులు ఉండి అభివృద్ధి చేయకపోతే నేరమని చెప్పారు. మా పాలనలో పారిశ్రామికవేత్తలు హ్యాపీగా ఉన్నారని చెప్పారు.
పక్కకు తప్పుకునే ప్రసక్తి లేదు
రెవెన్యూ డిపార్టుమెంట్ అద్భుతంగా పని చేస్తోందన్నారు. తెలంగాణ వస్తే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పానని, ఇప్పుడు ఒక లక్షా 12 వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు. కోదండరాంది స్ఫూర్తియాత్ర కాదని మండిపడ్డారు. తాము అన్ని మతాలను, కులాలను కలుపుకొని పోతున్నామని చెప్పారు. దొంగే దొంగ అన్నట్లుగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయన్నారు. సింగరేణిలో విపక్షాలు డబ్బు, మందు పంపిణి చేసి, ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మా అజెండా నుంచి పక్కకు తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తుంటే విపక్షాలకు కనిపించడం లేదా అన్నారు.