రోహిత్ చనిపోవడం బాధాకరం, సంపత్! ఫిర్యాదు చేయలేదే: కెసిఆర్, కాంగ్రెస్పై ఫైర్
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ), ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు విచారకరమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ శాసనసభలో సీఎం మాట్లాడుతూ.. హెచ్సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య విచారకరమన్నారు. ఓయూ ఘటనలు దురదృష్టకరమని, అందరం ఖండించదగినవేన్నారు.
ఓయూలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కారుపై జరిగిన దాడిని సీఎం ఖండించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్సీయూ, ఓయూ ఘటనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందో తాము కూడా తెలుసుకోవాలని అన్నారు.
అయితే, దాడి జరిగిందంటున్న ఆ ఎమ్మెల్యే ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. దాడి జరిగినప్పుడు ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో అరవడం కాదు ఫిర్యాదు చేయాలని అన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు ఆందోళన చేయడంపై సీఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరుపుతామన్న ఆందోళన చేయడం సరికాదన్నారు. లేని పంచాయతీని పెట్టుకుందాం అంటే ఎలా అని ప్రశ్నించారు. గంట ఎక్కువైనా చర్చించుకుందామని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ మైలేజ్ కోసమే ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు ఏం చేయాలో తెలుసని అన్నారు.
కాగా, వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైనా ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో పోడియం వద్ద తెలపడం గొప్ప పని కాదని కెసిఆర్ అన్నారు.
దళిత విద్యార్థి ఆత్మహత్యపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా సీఎం కెసిఆర్ కల్పించుకున్నారు. మీకు ఏం కావాలో స్పష్టంగా చెప్పండి అని అన్నారు. సభా నాయకుడిగా మధ్యలో కల్పించుకోవచ్చని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.