బెంగళూరుకు కేసీఆర్, వెంటే ప్రకాశ్రాజ్: దేవెగౌడతో కీలక అంశాలపై చర్చ
Recommended Video
హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కొత్త రాజకీయ కూటమి(ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటుపై చర్చించేందుకు శుక్రవారం ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరు బయలుదేరారు కేసీఆర్.
ఈ పర్యటనలో ఆయన మాజీ ప్రధాని, జనతాదళ్(లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ, మాజీ సీఎం, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితో భేటీ కానున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, ఎంపీలు వినోద్, సంతోష్, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ తదితరులతో కూడిన బృందంతో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయల్దేరి వెళ్లింది.
మధ్యాహ్నం భేటీ
కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దేవెగౌడ నివాసానికి చేరుకొని ఆయనతో, కుమారస్వామితో సమావేశమవుతారు. కాంగ్రెస్, బీజేపీకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేపట్టిన కేసీఆర్.. ఇప్పటికే కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిసి దీనిపై చర్చించారు. ఆ తర్వాత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ను కలిసి దీనిపై మాట్లాడారు.
దేవెగౌడతో భేటీ అందుకే
తాజాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం గల దేవెగౌడతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. జనతాదళ్-ఎస్.. బీజేపీ, కాంగ్రెస్లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విడిగా పోటీ చేస్తుంది. తమ లక్ష్యాలకు అనుగుణంగా జేడీఎస్ పనిచేస్తున్నందున దేవెగౌడను కలిసి కొత్త కూటమిపై చర్చించాలని కేసీఆర్ భావించారు.
కీలక అంశాలపై చర్చ
దేవేగౌడ కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కర్ణాటక రాజకీయాల్లో కీలకనేతగా ఉన్నారు. ఆయన కూడా కేసీఆర్తో జరిగే సమావేశంలో పాల్గొంటారు. వారితో గురువారం సీఎం ఫోన్లో మాట్లాడి తన పర్యటన సమాచారాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో కేసీఆర్.. కొత్తకూటమి, బీజేపీ, కాంగ్రెస్ల వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాలు, సమాఖ్య స్ఫూర్తి, ఇతర అంశాలపై చర్చించనున్నారు.
ఎన్నికలతో సంబంధం లేదు
అంతేకాగా, రిజర్వేషన్ల పెంపుదల బిల్లుకు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జేడీఎస్ సహకారం కోరనున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్, దేవెగౌడలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ చేరుకుంటారు. బెంగళూరుకు వెళ్లేముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తన పర్యటనకు సంబంధం లేదని అన్నారు.