కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా? నాటి బలం ఇదీ, కానీ సెంచరీకి చేరువ: మేనిఫెస్టో రహస్యం!
హైదరాబాద్: తెలంగాణకు ఎన్నికల నగారా మోగింది. ఓ వైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో కేసీఆర్కు ఓటు వేశారని, ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు, తెలంగాణ తేవడంతో పాటు, ఈ నాలుగున్నరేళ్ల పాలన నేపథ్యంలో ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారని తెరాస అంటోంది.
డీకే అరుణా! కాస్కో నీ బండారం బయటపెడతా, ఆధారాలు: కేసీఆర్ తిట్ల దండకం
ఈ నేపథ్యంలో 2014లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయో చూస్తే... తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి 63 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మార్జిన్కు కేవలం మూడు సీట్లు మాత్రమే ఎక్కువగా గెలుచుకుంది.
నాటి బలం ఇదీ
కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల్లో గెలిచింది. తెలుగుదేశం 15 చోట్ల విజయం సాధించింది. ఇందులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచినవే 12 స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఐదు స్థానాల్లో గెలవగా, ఇతరులు ఎనిమిది స్థానాల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో తెరాస ఓట్ షేర్ 34 శాతంగా ఉంది. కాంగ్రెస్ ఓట్ షేర్ 25 శాతం కాగా, తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ 15 శాతం, బీజేపీ ఓట్ షేర్ 7 శాతంగా ఉంది. ఇతరుల ఓట్ షేర్ 19 శాతంగా ఉంది.
కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా
ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని విపక్షాలు అంటున్నాయి. దానికి తోడు విపక్షాలు అన్ని దాదాపు ఒక్కటవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ గతంలో సాధించిన 63 సీట్లు అయినా సాధిస్తారా లేక తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా దాదాపు వంద సీట్ల వరకు సాధిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందా, తగ్గుతుందా అనే చర్చ కూడా సాగుతోంది.
మేనిఫెస్టోపై కసరత్తు
టీఆర్ఎస్ మేనిఫెస్టో దసరా తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోను జనరంజకంగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. మేనిఫెస్టోపై పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కే కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికే ఒకసారి భేటీ అయింది. వివిధ వర్గాలు, సంఘాల నేతలు కేకేను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. కమిటీ నేతలతో సీఎం కూడా చర్చిస్తున్నారు. ఆదివారం జరిగిన భేటీలో అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మేనిఫెస్టోపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపాలని నిర్ణయించారు.
అంతా రహస్యంగా
ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున మేనిఫెస్టోను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 9 నుంచి బతుకమ్మ పర్వదినాలు ప్రారంభమవుతాయి. 18న విజయ దశమి ఉంది. ఈలోగా కసరత్తు పూర్తి చేసి దసరా తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మేనిఫెస్టోలోని అంశాలు బయటకు వస్తే విపక్షాలు వాటిని ప్రకటించే అవకాశముందని, అందువల్ల దీనిపై గోప్యత పాటించాలని నేతలకు సూచించారని తెలుస్తోంది.