చంద్రబాబుతో కెసిఆర్ దోస్తీ: గుట్టు విప్పిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరైనప్పటి నుంచి తెలంగాణలో సంభవించే రాజకీయ పరిణామాలపై వార్తలు వస్తున్నాయి.
Recommended Video
దాని గుట్టును బహుశా ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కావాలనే విప్పి ఉంటారు. ఏమైతేనేం స్పష్టంగా అదేమిటో చెప్పేశారు. ఆయన ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన కాలమ్లో కెసిఆర్ వ్యూహరచన గురించి వివరించారు. తెలంగాణలో కమ్మ, వెలమ కాంబినేషన్కు కెసిఆర్ శ్రీకారం చుట్టారని. తద్వారా రెడ్డి నాయకత్వాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆయన చెప్పేశారు.
రెడ్డి నాయకత్వాన్ని అంటే కాంగ్రెసు పార్టీని అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెసు రెడ్డి నాయకత్వంలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
స్పష్టమైన రాజకీయ వ్యూహంతోనే...
పరిటాల రవి అంటే కమ్మ సామాజికవర్గానికి అబిమానం ఉంది. దీన్ని గుర్తించిన కేసీఆర్ ఆ సామాజికవర్గాన్ని తనవైపు పూర్తిగా తిప్పుకోవడానికై అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరిగిన పరిటాల శ్రీరామ్ వివాహాన్ని వాడుకున్నారు. తనతో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి తుమ్మలతో పాటు తెలుగు రాష్ర్టాల కమ్మ సంఘం అధ్యక్షుడు కూడా అయిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రభృతులను వెంకటాపురం తీసుకెళ్లారు. ఇదంతా రాధాకృష్ణ తన కాలమ్లో రాసిందే.
కేశవ్తో ఇలా కెసిఆర్...
తిరుగు ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పయ్యావుల కేశవ్తో కెసిఆర్ హెలిప్యాడ్ వద్ద ప్రత్యేకంగా మంతనాలు జరిపినట్టు ఒక సన్నివేశాన్ని సృష్టించారని రాధాకృష్ణ రాశారు. కేశవ్కు కూడా కమ్మ సామాజిక వర్గంలో గుర్తింపు ఉంది.
తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం రాజకీయంగా తనను వ్యతిరేకిస్తున్నందున తెలంగాణలో సంఖ్యాపరంగా బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గంతో స్నేహంగా ఉండాలని తాను భావిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కేశవ్తో అన్నారనే విషయాన్ని రాధాకృష్ణ చెప్పేశారు.
దాన్ని కూడా ప్రస్తావించారట...
తెలంగాణలో వెలమ, కమ్మ సామాజికవర్గాలు దగ్గరవ్వడంతో ‘వెల్కం' గ్రూప్ అని నామకరణం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా కేశవ్ వద్ద కేసీఆర్ ప్రస్తావించారు. నిజానికి ఈ వెల్కం గ్రూపు ఫార్ములాను ఒకప్పడు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశారు. రెడ్డి సామాజికవర్గాన్ని ఎదుర్కోవడానికై అప్పట్లో జలగం వెంగళరావు కమ్మ సామాజికవర్గాన్ని దగ్గరకు తీశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే ఫార్ములాను తెరపైకి తెచ్చారు. పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరవ్వడం ద్వారా తెలంగాణలోని కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాల్సిన సందేశాన్ని ఆయన ఇచ్చారు. అని రాధాకృష్ణ స్పష్టంగా గుట్టు విప్పారు.
మధ్యవర్తి రాధాకృష్ణ
రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలోని కమ్మ సామాజికవర్గాన్ని దరి చేర్చుకునే క్రమంలో కెసిఆర్ దోస్తీ కడుతున్నారని అనుకోవచ్చు. ఆ సామాజిక వర్గం నేతలంతా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఈ తెలుగుదేశం నేతలను తెరాసలోకి ఆహ్వానించడానికి కెసిఆర్ రంగం సిద్ధం చేసుకున్నారు. అందుకు ఆయనకు చంద్రబాబుతో స్నేహం కూడా అవసరమై ఉండవచ్చు. ఈ దోస్తీ కుదరడానికి, తెలంగాణ కమ్మ సామాజికవర్గాన్ని తెరాసలోకి తేవడానికి రాధాకృష్ణనే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
నల్లగొండ ఉప ఎన్నిక అందుకే...
నల్లగొండ ఉప ఎన్నికను కెసిఆర్ ఆహ్వానించడానికి కారణం కూడా రెడ్డి నాయకత్వాన్ని దెబ్బ తీయడానికే అనే అభిప్రాయం బలంగా ఉంది. కాంగ్రెసు పార్టీలోని ఎక్కువ మంది సీనియర్ నాయకులు రెడ్లు, నల్లగొండ జిల్లాకు చెందినవారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నాయకుడు కె. జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు. అందువల్ల నల్లగొండ పార్లమెంటు సీటులో కాంగ్రెసును ఓడించడం ద్వారా రెడ్డి నాయకత్వాన్ని ఓడించి, వచ్చే ఎన్నికల నాటికి రెడ్డి వ్యతిరేక ఓటును కూడగట్టడమే కాకుండా, రెడ్లకు వ్యతిరేకంగా ఉన్న సామాజికవర్గాలు కూడగట్టుకోవడం సులభమవుతుందని కెసిఆర్ భావిస్తూ ఉండవచ్చు. అందుకు కమ్మ సామాజిక వర్గం తనకు ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటూ ఉండవచ్చు.
తుమ్మలతోనే ప్రారంభం...
ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావును తెలుగుదేశం నుంచి తెరాసలోకి రప్పించడంతోనే కెసిఆర్ వెల్కమ్ ఫార్ములాకు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. తుమ్మల నాగేశ్వర రావు పార్టీ అంతర్గత విషయాల్లో చాలా పనులు చేస్తున్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే చంద్రబాబు తెలంగాణలో టిడిపిని వదిలేశారు. ఇక ముందు కూడా ఏమీ పట్టించుకోకుండా ఉండడానికి, కమ్మ సామాజికవర్గం తెలంగాణ నాయకులు తెరాసలోకి వస్తే మాట్లాడకుండా ఉండడానికి కెసిఆర్ చంద్రబాబుతో దోస్తీని కట్టారని చెప్పవచ్చు.
కెసిఆర్ ఎత్తుగడ అదే...
కెసిఆర్ అధికారంలోకి రాగానే హడావిడిగా కొన్ని సంస్థల పేర్లు మార్చేశారు. ఆంధ్రుల పేర్లు తీసేసి జయశంకర్, కాళోజీ వంటి పేరు మీదికి వాటిని మార్చేశారు. తెలంగాణ వైతాళికుల్లో అగ్రగణ్యుడైన సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతానని అంతర్గత చర్చల్లో ఏనాడో చెప్పారు. కానీ దాన్ని కార్యరూపంలోకి తేవడం లేదు. కెసిఆర్ తలుచుకుంటే అదో లెక్క కాదు. కానీ అలా చేయకపోవడం వెనక తెలంగాణలో సామాజికవర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవడమేనని అంటున్నారు.
ఇలా తనకు....
తెలంగాణ రాష్ట్ర సాధన ఘనతను కెసిఆర్ వ్యక్తిగతంగా తనకే కాకుండా తన సామాజిక వర్గానికి కూడా ఆపాదించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఆయన బయటపడ్డారు. తెలంగాణలో తాను మైనారిటీ కులానికి చెందినవాడినని, అత్యంత తక్కువగా ఉన్న ఆ కులమే తెలంగాణను సాధించిందని చెప్పుకున్నారు. తద్వారా తెలంగాణలోని అన్ని సామాజికవర్గాల పాత్రను ఆయన కొట్టిపారేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.